నిద్రమత్తు, అతివేగం నలుగురు ప్రాణాలను బలిగొంది. తమ సంబంధికునికి ఎయిర్ పోర్టులో సెండ్ ఆఫ్ ఇచ్చి వస్తుండగా నలుగురు వ్యక్తులు రోడ్డు ప్రమాదానికి గురై అనంతలోకాలకు వెళ్లిపోయారు. డ్రైవర్ అజాగ్రత్తగా నడపడంతోనే ప్రమాదం సంభవించిందని పోలీసులు భావిస్తున్నారు.
కామారెడ్డి జిల్లా భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ శివారులోని కృష్ణమందిర్, ఆర్టిఓ చెక్ పోస్టు మధ్యలో హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న వెర్నా కారు వేగంగా వచ్చి ఓ చెట్టుని ఢీకొంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు.
కారు నుజ్జునుజ్జు కావడంతో మృతదేహాలు కారులోనే ఇరుక్కుపోయాయి. పక్కనే ఉన్న హోటల్ యజమాని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కారులో ఇరుక్కున్న మృతదేహాలను వెల్డర్ సహాయంతో బయటకు తీశారు.
మృతి చెందిన వారిలో డ్రైవర్ మ్యాతరీ ప్రశాంత్ నిజమాబాద్ జిల్లా నవిపెట్ కు చెందినవాడు కాగా మిగతా ముగ్గురు నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మానగర్ కు చెందిన మంథని లావణ్య, రోషిణిగా గుర్తించగా ఇంకొకరి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి జిల్లా ఆస్పత్రికి తరలించారు పోలీసులు.