గంజాయి మత్తుకు బానిసై విద్యార్థులు, తమ విలువైన జీవితాలను నాశనం చేసుకోవద్దని గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి సూచించారు. గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల్ని అరెస్ట్ చేసి మంగళవారం మధ్యాహ్నం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.
అర్బన్ ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో మంగళగిరి పట్టణంలోని పాత బ్యాంకు కాలనీలో మన్నవ విజయ్ కుమార్ అనే వ్యక్తి ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఈ దాడుల్లో పట్టణ సి ఐ శీలం శ్రీనివాసులురెడ్డి,ఎస్సై జెఎస్ రావు,సిబ్బంది నాగాంజనేయులు పాల్గొన్నారు.
ఆ ఇంటిలో గంజాయి అమ్ముతున్న ఇందిరా నగర్ కు చెందిన ఎం రవితేజ,డ్రైవర్ పేటకు చెందిన ఎస్ కె యాసిన్,బ్యాంకు కాలనీకి చెందిన మన్నవ ఆకాష్,కాజ గ్రామానికి చెందిన ఎం నాగరాజు లను అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుండి ఐదున్నర కేజీల గంజాయి స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.
విశాఖ నుంచి వస్తున్న గంజాయి
వీరంతా విశాఖపట్టణంలోని సంజు అనే వ్యక్తి నుండి గంజాయి తెచ్చి యువకులు కళాశాల విద్యార్థులకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నట్లు ఎస్పీ అమ్మిరెడ్డి తెలిపారు. విశాఖ పోలీసుల సహకారంతో సంజును అరెస్ట్ చేస్తామని చెప్పారు.
గంజాయి విక్రయించే వారితో పాటు వినియోగించే వారిపైనా కేసులు నమోదు చేస్తున్నామని అన్నారు. సరదాగా గంజాయి సేవిస్తూ, వినియోగదారులే,విక్రయదారులుగా మారుతున్నారని చెప్పారు. గంజాయి మూలాల్ని సమూలంగా అంతమొందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు.
ఇందులో భాగంగానే మంగళగిరి లో దాడులు నిర్వహించినట్లు స్వష్టం చేశారు. గంజాయికి అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని పిలుపునిచ్చారు. గంజాయి కేసులో పట్టుబడి పోలీస్ రికార్డుల్లోకి ఎక్కితే ఎన్ డి పి ఎస్ యాక్టు క్రింద పదేళ్ల శిక్ష పడుతుందన్నారు. సస్పెక్ట్ షీటు తెరుస్తారని హెచ్చరించారు.
కళాశాలల్లోనూ గంజాయి వినియోగిస్తున్నట్లు సమాచారం ఉందని త్వరలో కళాశాలల ఉపాధ్యాయులు,విద్యార్థులకు కౌన్సిలింగ్ నిర్వహిస్తామని చెప్పారు. మంచి ప్రవర్తనతో మెలిగితే చక్కటి భవిష్యత్ ఉంటుందని ఎస్పీ పేర్కొన్నారు.
సిబ్బంది కొరత పరిష్కరిస్తాం-ఎస్పీ
త్వరలో జరిగే పోలీస్ నియామకాల ద్వారా మంగళగిరి పట్టణ పోలీస్ స్టేషన్ లో సిబ్బంది కొరత సమస్యను పరిష్కరిస్తామన్నారు. ఈ లోపు ఎన్ సిసి సిబ్బంది సేవలు వినియోగించుకొని ట్రాఫిక్ సమస్య వంటి సమస్యల్ని పరిష్కరిస్తామన్నారు. నేరాల నియంత్రణకు సి సి కెమెరాల వినియోగం తప్పని సరి అని ,వాణిజ్య,వ్యాపార సంస్థల సహకారంతో ఆయా ప్రాంతాల్లో సి సి కెమెరాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.
మేడికొండూరు, పట్టాభిపురం,ఆరందలపేట లలో వ్యాపారులు స్వచ్ఛందంగా కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారని అన్నారు. అదే విధంగా మంగళగిరి పట్టణం లోనూ వ్యాపారులు తమ దుకాణాల్లోనే కాకుండా ఆ వీధి మొత్తం కవర్ చేసేలా కెమెరాలు ఏర్పాటు చూసుకోవాలని కోరారు.
ఇలా ప్రజలు భాగస్వాములై సి సి కెమెరాలు ఏర్పాటు చేసుకుంటే పోలీస్ కంట్రోల్ రూమ్ కు అనుసంధానిస్తామని చెప్పారు. దీని వల్ల ప్రజల బాధ్యత పెరగటంతో పాటు నేరాల నియంత్రించేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.