పెద్దపల్లి జిల్లా రామగుండం డివిజన్-3 పరిధిలోని ఓపెన్ కాస్ట్(ఉపరితల గని)-1 లోని ఫేస్-2లో గల బ్లాస్టింగ్ స్పాట్ వద్ద పేలుడు సంభవించి నలుగురు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాల పాలయ్యారు.
మరణించిన నలుగురు కార్మికులను కమాంపూర్ కు చెందిన బిల్లా రాజేశం, గోదావరిఖని కి చెందిన రాకేష్, బండారి ప్రవీణ్, అర్జయ్యలుగా గుర్తించారు. వీరంతా కాంట్రాక్టు కార్మికులు. మృతదేహాలను గోదావరిఖనిలోని సింగరేణి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి వద్ద మృతుల కుటుంబ సభ్యుల రోదనలు హృదయ విదారకంగా ఉన్నాయి. గాయపడ్డ ఇద్దరికి కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స నిర్వహిస్తున్నారు.
13 మంది కార్మికులు బ్లాస్టింగ్ స్పాట్ వద్ద విధులు నిర్వహిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ సమయంలో 5గురు కార్మికులు మంచినీళ్లు త్రాగడానికి వెళ్లగా మరో ఆరుగురు కార్మికులు బ్లాస్టింగ్ స్పాట్ వద్ద ఉన్నారు. మట్టిని ఫీల్ చేస్తుండగా భూమిలో నుంచి వేడి వచ్చి బ్లాస్టింగ్ సంభవించింది.
ఈ ప్రమాదంలో రత్నాపూర్ గ్రామానికి చెందిన భీమయ్య కు రెండు కాళ్లు విరగగా, కమాన్ పూర్ కు చెందిన వెంకటేష్ కు రెండు కళ్ళు పోయాయి. సూపర్ వైజింగ్ విధులు నిర్వహిస్తున్న ఇద్దరు కార్మికులు స్వల్ప గాయాలతో బయట పడ్డారు.