గణపతి సచ్చిదానంద ట్రస్ట్ సహకారం తో వరంగల్ లోని లూయిస్ ఆదర్శ అంధుల పాఠశాలలో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు. పిల్లలకు, స్వయంకృషి వృద్ధ ఆశ్రయం లోని వృద్ధులకు, సిబ్బంది కి ఉచిత మందులను అందించారు. డాక్టర్ కంటేం లక్ష్మీనారాయణ వైద్య పరీక్షలు నిర్వహించి తగిన సూచనలను సలహాలు అందించారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రత లోపించడం వలన వివిధ రకాల వ్యాధులు సంక్రమిస్తాయని జాగ్రత్తగా ఉండాలని డాక్టర్ ని సంప్రదించ కుండా ఎలాంటి మందులు వేసుకోకూడదని అన్నారు. అలాగే త్రాగు నీరు కలుషితం కావడం ద్వారా అతి సారం, వాంతులు లాంటి వ్యాధులు రావచ్చునని తెలిపారు. వీటిని నివారించడం కోసం తప్పనిసరిగా కాచి చల్లార్చి వడపోసిన నీటిని తాగాలని సూచించారు. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు మాత్రమే తినాలని ఆహార పదార్థాలపై మూతలు సరిగా ఉంచాలని కోరారు.
నిల్వ ఉంచిన ఆహార పదార్థాలు తీసుకోకూడదని, పౌష్టికాహారం, ఆకుకూరలు ఎక్కువ తీసికోవాలని డాక్టర్ లక్ష్మీనారాయణ చెప్పారు. ప్రతి నెలా నిర్వస్తున్న ఉచిత వైద్య శిబిరాలు వినియోగించుకోవాలని జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్, అనురాగ్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ అనితా రెడ్డి కోరారు. ఈ కార్యక్రమం లో శోభ, రని, సారంగం పాల్గొన్నారు.