కరోనా సమయంలో ఎంతో మంది పేదలు తిండికి లేక ఇబ్బంది పడుతుంటే ఇక్కడ మాత్రం బియ్యం దొంగలు విజృంభిస్తున్నారు. పేదవారికి ఇవ్వాల్సిన బియ్యాన్ని అమ్ముకుందామన్న ఆలోచన ఎలా వచ్చిందో కానీ నాగర్ కర్నూల్ జిల్లా కోడూరు మండల కేంద్రంలోని డీలర్ షాప్ నెంబర్ 3 డీలర్ యజమాని మాత్రం ఈ పని చేసి పట్టుబడ్డారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పేద ప్రజలకు లాక్ డౌన్ సమయంలో ఉచితంగా అందజేసే రాయితీ బియ్యాన్ని కోడూరు మండల కేంద్రంలోని డీలర్ షాప్ నెంబర్ 3 డీలర్ అయిన సి శారద పక్కదారి పట్టించారు.
95 క్వింటాల 93 కిలోల బియ్యాన్ని శనివారం సీజ్ చేశామని జిల్లా పౌరసరఫరాల అధికారి మోహన్ బాబు తెలిపారు. కోడేరు మండల కేంద్రంలో జరిగిన ఘటనపై పౌర సరఫరాల సెక్షన్ ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేశామని, డీలర్ ను ఈరోజు అరెస్టు చేశామని ఆయన తెలిపారు.
రెవెన్యూ అధికారులు తనిఖీల నిర్వహణలో వెల్లడైన వివరాల ప్రకారం మహబూబ్ నగర్, వనపర్తి హైదరాబాద్, మెదక్, నల్గొండ పెద్దపల్లి, నాగర్ కర్నూల్ తదితర మొత్తం 11 జిల్లాల్లోని 275 మంది రేషన్ కార్డు దారులు బియ్యాన్ని, విఆర్ఓ సహాయంతో అక్రమంగా డ్రా చేశారని తెలిపారు.
రేషన్కార్డు ఉన్న ప్రతిఒక్కరికి 12 కిలోల చొప్పున బియ్యం పంపిణీ చేయాలన్న ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా అందజేస్తున్న రేషన్ బియ్యాన్ని, ఆయా జిల్లాల్లో రేషన్ కార్డు దారుల పేర్ల పైన 95 క్వింటాల 93కీలోల బియ్యం అక్రమంగా డ్రా చేసి బ్లాక్ మార్కెట్ చేసేందుకు నిల్వఉంచారని ఆయన తెలిపారు.
బియ్యాన్ని సీజ్ చేసి ప్రజా పంపిణీ చట్టం ప్రకారం క్రిమినల్ కేసు నమోదు చేయడం తో పాటు డీలర్ షిప్ ను రద్దు చేశామని చెప్పారు. డీలర్ కు విఆర్ఓ సహకరించినట్లు వెల్లడైందని అతని పై జిల్లా కలెక్టర్ కు నివేదించామని జిల్లా పౌర సరఫరాల అధికారి మోహన్ బాబు తెలిపారు.