ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి (ఫిర్యాదుల విభాగం) కార్యక్రమం వచ్చే సోమవారం నుండి జిల్లా కలెక్టర్ కార్యాలయంతో పాటు అన్ని మండల కేంద్రాల్లో పునఃప్రారంభం అవుతుందని నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కరోనా కారణంగా కొద్ది రోజుల కిందట ఈ కార్యక్రమం నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం కోసం జిల్లాలోని 20 మండల కేంద్రాలకు జిల్లాస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులుగా నియమించడం జరిగిందని, వారి ఆధ్వర్యంలో మండల స్థాయి అధికారులందరు మండలంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమాలకు విధిగా హాజరు అవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. మండలానికి సంబంధించిన ప్రజావాణి సమస్యలు మండల స్థాయిలోనే పరిష్కరమయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక అధికారులను ఆదేశించారు.
అదేవిధంగా జిల్లా కేంద్రం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సంబంధిత జిల్లా అధికారులు విధిగా హాజరై, ప్రజల నుండి వచ్చే గ్రీవెన్స్ ఫిర్యాదులను పరిష్కరించేందుకు ఆయా శాఖల జిల్లా అధికారులు సంసిద్ధంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశామని, బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మండల స్థాయిలో పరిష్కరించాల్సిన ఫిర్యాదులను సంబంధిత మండల కేంద్రంలోని ఇవ్వాలని ఫిర్యాదుదారులను కలెక్టర్ కోరారు.
అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్