జగిత్యాల జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. జగిత్యాల అడిషనల్ ఎస్పీగా పని చేస్తున్న దక్షిణ మూర్తి కరోనాతో మృతి చెందారు. వారం రోజుల కిత్రం కోవిడ్ బారిన పడిన ఆయన కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
అయితే దక్షిణామూర్తి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో బుధవారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. 1989 బ్యాచ్ కు చెందిన దక్షిణ మూర్తి వరంగల్ జిల్లాలో ఎస్సై, సీఐ, డీఎస్పీగా పనిచేశారు. నక్సల్స్ ఆపరేషన్స్ తో పాటు వరంగల్ లో సంచలనం కలిగించిన యాసిడ్ దాడి కేసులో నిందితుల ఎన్ కౌంటర్ లో కూడా ఆయన కీలక అధికారిగా వ్యవహరించారు.
ఖమ్మం, కరీంనగర్ జిల్లాలో కూడా పని చేశారు. ఇటీవల జిల్లాలో కరోనా సోకి అనారోగ్యం పాలైన పోలీసులు చికిత్స పొంది తిరిగి విధుల్లో చేరినప్పుడు వారికి ఘన స్వాగతం పలికి పోలీసుల్లో మనో ధైర్యం నింపే ప్రయత్నం చేశారు. దక్షిణ మూర్తి ఆకస్మిక మృతితో జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది.
ఆయన కుటుంబానికి పలువురు ఉన్నతాధికారులు ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేశారు. మొన్న వర్షాలు, వరదలు వచ్చిన నేపధ్యంలో కూడా ఆయన విస్తృతంగా జిల్లా లో పర్యటించారు. ఈ నేపథ్యం లో కరోనా సోకడంతో అయన హాస్పిటల్ లో జాయిన్ అయ్యారు.
ఎన్ కౌంటర్ స్పెషలిస్ట్ గా లా అండ్ ఆర్డర్ బాగా చేస్తాడని ఆయనకు డిపార్ట్ మెంట్ లో ప్రజల్లో పేరుంది. ఎక్కువ కాలం అయన వరంగల్ లోనే వివిధ హోదాల్లో పని చేశారు. 1989 బ్యాచ్ ఎస్సైగా ఎంపిక అయి పోలీస్ శాఖలోకి వచ్చిన దక్షిణా మూర్తి ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఎస్సై, సిఐ, డి ఎస్ పీ గా పనిచేశారు.
కరీంనగర్ సవారాన్ స్ట్రీట్ కు చెందిన దక్షిణ మూర్తి జిల్లాల పునర్విభజనతో జగిత్యాల అడిషనల్ ఎస్పీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.