కరోనా కష్ట కాలంలో వాక్ ఫర్ వాటర్ సంస్థ, మార్కెటింగ్ శాఖతో కలసి చేపట్టిన ఇంటికే పండ్ల కార్యక్రమం సరికొత్త లక్ష్యాన్ని అధిగమించింది. ఇప్పటి వరకు లక్షమందికి రోగ నిరోధక శక్తిని పెంచే బహురకాల పండ్లను పంపిణీ చేసింది. అక్షరాల లక్ష ఆర్డర్ని కూకట్ పల్లి లోని జలవాయువిహార్ ఇండియన్ ఎయిర్ ఫోర్సు కాలనీ ప్రాంతానికి చెందిన లక్ష్మి అనే మహిళ ఇంటికి స్వయంగా వెళ్లి తాజా పండ్లని అందించారు వాక్ ఫర్ వాటర్ సంస్థ ఎం కరుణాకర్రెడ్డి.
ఈ సందర్భంగా ఇంట్లో పండ్ల వాడకం, ఎక్కడ ఖరీదు చేస్తారు? ఇంటికే పండ్ల నాణ్యత ఎలా ఉంది వంటి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ సర్కార్, ప్రజాప్రతినిధులు, మార్కెటింగ్ అధికారుల సహకారంతో గత నెలన్నర రోజులుగా పండ్ల పంపిణీని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని కరుణాకర్ తెలిపారు.
అద్భుత ప్రజాదరణతో అతి తక్కువ సమయంలోనే లక్ష కుటుంబాలకు సరఫరా చేయగలిగామని పేర్కొన్నారు. ఏక కాలంలో ఇటు రైతులు అటు వినియోగదారులకి చేరువయ్యామని మున్ముందు కూడా ఈ కార్యక్రమం కొనసాగిస్తామని చెప్పారు. ఇటీవల రాజ్య సభ సభ్యుడు జోగినపల్లి సంతోషుకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ బత్తాయి దినోత్సవానికి విశేష స్పందన లభించిందన్నారు. తక్కువ ధరలతో సరఫరా చేసిన తాజా పండ్ల నాణ్యత, నిల్వ కాలం బాగున్నందున ప్రజలు మళ్లీ మళ్లీ ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నట్లు వెల్లడించారు. అలాగే ఆర్డర్ల నమోదు కోసం ప్రత్యేకంగా ప్రారంభించిన మిస్డ్ కాల్, వెబ్సైట్కి లక్షల్లో వినతులు వస్తున్నాయని వాక్ ఫర్ వాటర్ వ్యవస్థాపకుడు కరుణాకర్ రెడ్డి తెలిపారు.