ఒమిక్రాన్ వేరియంట్ కర్ణాటకలో వెలుగులోకి వచ్చింది. ప్రపంచవ్యాప్తంగా డేంజర్ బెల్స్ మోగించిన కొత్త వేరియంట్పై.. రాష్ట్రంలోని ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. రెండు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదయ్యాయి. దీంతో కర్ణాటక సర్కార్ అప్రమత్తమయ్యింది.
కర్ణాటకలో ఒమిక్రాన్ వ్యాప్తిని ఎదుర్కోవడానికి కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ప్రభుత్వం సరికొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. ప్రజలందరూ కరోనా వైరస్ నివారణ కోసం వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకోవాలని సూచించింది. అంతేకాదు వ్యాక్సిన్ రెండు డోసులను తీసుకున్నవారిని మాత్రమే సినిమా హాళ్ళు, షాపింగ్ మాల్స్, పార్కులలోకి అనుమతించాలని సూచించింది.
అంతేకాదు తల్లిదండ్రులు వ్యాక్సిన్లు తీసుకుంటేనే విద్యార్థులకు ఆఫ్ లైన్ క్లాసులకు అనుమతిస్తామని అధికారులు చెప్పారు. వ్యాక్సిన్ తీసుకొని తల్లిదండ్రుల పిల్లలను పాఠశాలల్లో ఆఫ్లైన్ తరగతులకు అనుమతినివ్వమని చెప్పారు. మాస్క్ లేని వారికీ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రూ. 250, ఇతర ప్రాంతాల్లో రూ. 100 జరిమానా విధించనున్నారు. మరోసారి కోవిడ్ పేషేంట్స్ కోసం ఆసుపత్రులను సిద్ధం చేస్తున్నారు.