శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ద్వారా జనజాగరణ నిధి సమర్పణ కార్యక్రమాన్ని నేడు కొమురం భీం జిల్లా బిజెపి ఉపాధ్యక్షురాలు డా.కొత్తపల్లి అనిత ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె కాగజ్ నగర్ లోని న్యూ కాలనీలోని గణేష్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డా.కొత్తపల్లి అనిత మాట్లాడుతూ ప్రతి ఒక్క హిందూ బంధువులు శ్రీ రామ జన్మభూమి ఆలయ నిర్మాణానికి ప్రతి ఒక్కరం భాగస్వాములు కావాలని కోరారు.
ఐదు వందల సంవత్సరాల నుండి జరుగుతున్న పోరాటం ఇప్పటికి ఫలిస్తున్నదని ఆమె అన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి సంబంధించిన పోరాటాల ఫలితంగా 2019 నవంబర్ లో కోర్టు తీర్పు హిందువులకు అనుకూలంగా వచ్చిందని ఆమె తెలిపారు.
శ్రీరాముడు భారతదేశ ఆత్మ, శ్రీరామ జన్మభూమిలో భవ్యమైన శ్రీ రామ మందిరం నిర్మాణం కావాలన్న భారతీయుల ఆలోచనలకు శాశ్వత ప్రేరణ కోసం ఈ కార్యక్రమం చేపడుతున్నామని ఆమె అన్నారు. భవ్య మందిరం కోసం శ్రీరామ భక్తులు 492 సంవత్సరాలుగా నిరంతర సంఘర్షణ సాగించారు.
ఈ విధంగా జరిగిన 76 సంఘర్షణలో నాలుగు లక్షలకు పైగా రామ భక్తులు తమ ప్రాణాలను సమర్పించారని ఆమె అన్నారు. గత 36 సంవత్సరాలుగా క్రమశిక్షణాయుతంగా నిర్వహించిన ఉద్యమాల ఫలితంగా ఇప్పుడు రామాలయ నిర్మాణం దశకు వచ్చామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో హిందూ వాహిని కాగజ్ నగర్ పట్టణ అధ్యక్షులు పోలోజి శ్రీనివాస్, శైలజ, కల్పన, చంద్రకళ, జగన్, వసంత్, మధు, శ్రీనివాస్, కళ్యాణ్, సంతోష్, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.