ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్ప ప్రజా నాయకులని, పాలనాదక్షులని ప్రజా గాయకులు గద్దర్ వ్యాఖ్యానించారు. దేశ రాజకీయాల గతిని సమూలంగా మార్చాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేస్తే, దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ పెట్టడం ద్వారా సంపూర్ణ మద్దతునిస్తానన్నారు. జీహెచ్ఎంసి ఎన్నికల ప్రచారం సందర్భంగా టిఆర్ఎస్ వెంకటాపురం డివిజన్ ఇంఛార్జిగా వ్యవహరిస్తున్నమంత్రి కొప్పుల ఈశ్వర్ గురువారం గద్దర్ ను ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిశారు.
మంత్రితో గద్దర్ ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ కేసిఆర్ తెలంగాణ రాష్ట్ర సాధనకు14రోజుల పాటు కఠోర దీక్ష చేసిన సందర్భాన్ని గుర్తు చేశారు. గొప్ప నాయకుడైన కేసిఆర్ ఫెడరల్ ఫ్రంట్ పెట్టినట్టయితే, దానికి అనుబంధంగా కల్చరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసి ఆయనతో ముందుకు సాగాలనేది తన అభిమతమన్నారు. కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు ద్వారా రాష్ట్రంలోని దాదాపు సగభాగం సస్యశ్యామలంగా మారిందని, రైతులు, ప్రజలు సంతోషిస్తున్నారని కొనియాడారు. టిఆర్ఎస్ కార్పొరేటర్ గా వెంకటాపురం డివిజన్ నుంచి తిరిగి పోటీ చేస్తున్నసబితా కిశోర్ ను ఆశీర్వదించారు.