గాలేరు-నగరి సుజల స్రవంతి రెండో దశ పనుల్లో అంతర్భాగమైన 6,7 ప్యాకేజీలు సత్వర పూర్తి కై దశల వారి పోరాటానికి శ్రీకారం చుట్టేందుకు ఈ నెల 22న రైల్వేకోడూరులో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తలపెట్టిన సదస్సును జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి జి ఈశ్వరయ్య పిలుపునిచ్చారు.
గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో జరిగిన కరపత్రాల విడుదల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కరువు పీడిత రాయలసీమ కన్నీటి వెతలు తీర్చేందుకు చేపట్టిన గాలేరు నగరి సుజల స్రవంతి పాలకుల నిర్లక్ష్యానికి గురవడం వల్ల పూర్తి కి నోచుకోలేదు అన్నారు.
గాలేరు నుండి మొదలైన కాలువ నగరి వరకు చేరకముందే అపోహలు అనుమానాలు కలిగించే విధంగా ప్రాధాన్యత క్రమంలో రెండో దశ పనులు నిర్లక్ష్యం చేయబడుతున్నాయి అన్నారు.
కడప జిల్లాలోని కడప రాజంపేట రైల్వేకోడూరు నీటి కొరత తీర్చక ముందే చిత్రావతి – హంద్రీనీవా ఎత్తిపోతల పథకానికి టెండర్లు పిలిచినా ప్రభుత్వం రెండో దశ 6,7 ప్యాకేజీల పనుల పురోగతి లేకపోవడం ఇక్కడి రైతాంగం లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి అన్నారు.
రాజంపేట ,కోడూరు నియోజకవర్గాల్లో వేసవి ఆరంభంలోనే భూగర్భ జలాలు గణనీయంగా తగ్గిపోయి త్రాగునీటికి ఇబ్బంది పడాల్సిన పరిస్థితి దాపురిస్తుందని అన్నారు.
గాలేరు నగరి పూర్తి ద్వారా రాజంపేట కోడూరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి తాగునీరు ప్రతి ఎకరాకు సాగు నీరు అందించే అవకాశం ఉన్నదన్నారు అందుకోసం రైతాంగం దశల వారి పోరాటానికి సమాయత్తం కావాలని వారు పిలుపునిచ్చారు.
ఈ సదస్సుకు ప్రముఖ విశ్లేషకులు టి లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాసులు, కాంగ్రెస్ నాయకులు తులసి రెడ్డి, టిడిపి నాయకులు శ్రీనివాసులరెడ్డి, విశ్వనాథ నాయుడు, బత్యాల చెంగల్రాయుడు, సిపిఎం నాయకులు బి నారాయణ, నాగోతు రమేష్ తదితరులు పాల్గొంటారన్నారు.
ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, పి చంద్రశేఖర్, ఉపాధ్యక్షులు మలిశెట్టి రాహుల్, రైతు సంఘం నాయకులు మనోహర్ రెడ్డి, మలిశెట్టి జతిన్ తదితరులు పాల్గొన్నారు.