మతపరమైన కార్యక్రమాలను నిరోధించే అధికారం ప్రభుత్వానికి లేదని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. వినాయక చవితి ఉత్సవాలపై ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు కాగా దానిపై నేడు విచారణ జరిగింది.
ఈ సందర్భంగా ప్రైవేట్ స్థలాల్లో వినాయక ఉత్సవాలు నిర్వహించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ఒకేసారి ఐదుగురికి మించకుండా పూజలు చేసుకోవాలని హైకోర్టు ఈ సందర్భంగా సూచించింది.
అయితే పబ్లిక్ స్థలాల్లో విగ్రహాలు పెట్టుకుని, ఉత్సవాలు నిర్వహించడంపై మాత్రం కోర్టు అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ప్రభుత్వం తీసుకున్న చర్యలను సమర్థించిన హైకోర్టు, ప్రైవేటు స్థలాల్లో విగ్రహాలు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతి ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన కోవిడ్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని హైకోర్టు ఆదేశంలో పేర్కొంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం మతపరమైన కార్యక్రమాలను నిర్వహించుకునే అధికారం ప్రజలకు ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
మతపరమైన అంశాలపైన రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు అన్ని విషయాలను వివరించడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యుడు రఘురామకృష్ణంరాజు ధన్యవాదాలు తెలిపారు.