మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలోని టిఎస్ఐఐసి కాలనీ లో యువసేన యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణనాథుని నిమర్జన శోభాయాత్ర బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా సాగింది. యువసేన యూత్ అసోసియేషన్ చైర్మన్, టిపిసిసి కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాలుగా ఇక్కడ గణనాధుని ప్రతిష్టించి భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహిస్తున్నారు.
13 రోజుల పాటు భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించిన అనంతరం ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం నిమర్జన శోభాయాత్ర బయలుదేరింది. తొలుత వేలాది మంది భక్తుల కోలాహలం మధ్య గణనాథుడు లడ్డూలను వేలం వేశారు. మేళతాళాలు, బాజా భజంత్రీలతో పాటు దేదీప్యమానమైన విద్యుత్ దీపాల మధ్య గణనాధుని నిమర్జన ఊరేగింపు కొనసాగింది.
చిత్ర విచిత్ర వేషధారణలతో కళాకారులు చేసిన నృత్యాలు, ప్రదర్శనలు దారిపొడవునా భక్తులను ఆకట్టుకున్నాయి. నిమర్జనానికి తరలి వెళ్తున్న యువసేన గణనాథుడు కాప్రా సర్కిల్ పరిధిలో అతి పెద్ద విగ్రహం కావడంతో భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నిమజ్జన శోభాయాత్ర లో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కళాకారుల విన్యాసాలు, కోయదొరలు కోమ్మలాటలు, భైంసా, ఇంద్రవెల్లి కళాకారుల నృత్యాలు, పోతురాజుల విన్యాసాలతో శోభాయాత్ర ఆద్యంతం చూపరులను ఆకట్టుకుంది. నిమజ్జన శోభాయాత్ర ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. యువసేన గణనాధుని విగ్రహం కన్నులు మూసి తెరుస్తూ చెవులు ఊపు తుండడంతో ప్రత్యేకత సంతరించుకుంది.