రుతుపవనాల ప్రభావంతో గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పాపాఘ్ని నది పరవళ్లు తొక్కుతూ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఎగువన కురిసిన భారీ వర్షాల కారణంగా నది ఒరవడి మరింత పెరిగింది.
ఈ నేపధ్యంలో రాయలసీమ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన దేవాలయాల్లో ఒకటిగా పిలవబడే కడప జిల్లా చక్రాయపేట మండల కేంద్రంలోని శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం పవిత్ర పాపాఘ్ని నదికి గంగాహారతి ఇచ్చారు.
ఆలయ సహాయ కమిషనర్ అలవలపాటి ముకుందారెడ్డి పర్యవేక్షణలో ఆలయ ప్రధానార్చకులు కేసరి, రాజా స్వాములు వేద మంత్రాల ఉచ్చరణతో ఐదు రకాల హారతులతో గంగాహారతి నిర్వహించారు.
గండి వీరాంజనేయ స్వామి పాదాల సమీపంలో ప్రవహిస్తున్న పాపాగ్ని నదికి గంగా హారతి ఇచ్చి గంగ పూజ కార్యక్రమం శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో వారితో పాటు గోపాల స్వామి,రఘు స్వామి, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.