తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అమ్మవారి జాతర నిర్వహణ ద్వారా రాజకీయ లబ్ది పొందిన వారు తక్షణమే మున్సిపల్ కార్పొరేషన్ ఉద్యోగస్తులకు, కార్మికులకు గంగమ్మ జాతర బహుమానం ఇవ్వాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు.
కేవలం ఆ ప్రాంతానికి చెందిన సిబ్బందికే కాకుండా యావత్ తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ సిబ్బంది ఈ జాతరలో శ్రమించాల్సి వచ్చిందని ఆయన అన్నారు. అధికార పార్టీ నాయకుల ఫ్లెక్సీలు ఇతర ప్రచార హంగామాతో తిరుపతి నగరం తీవ్రంగా ఇబ్బందిపడిన సందర్భంలో మునిసిపల్ కార్మికులే అదనపు శ్రమపడి అంతా శుభ్రం చేశారని ఆయన అన్నారు. నగరపాలక సంస్థలో పనిచేస్తున్న రెగ్యులర్, ఔట్సోర్సింగ్ పారిశుధ్య కార్మికులకు,యుడిఎస్, వాటర్ వర్క్స్
కార్మికులతో పాటు నగరపాలక సంస్థలో పనిచేసే ప్రతి ఒక్కరికి 10 వేల చొప్పున “గంగమ్మ జాతర బహుమానం” ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం బ్రహ్మోత్సవాలు విజయవంతం చేసిన రెగ్యులర్ ఉద్యోగస్తులకు బ్రహ్మోత్సవ బహుమానం 12,500 ఒక పెద్ద లడ్డు వడ క్యాలెండర్ ఇస్తారు.
అలాగే ఔట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికులకు అందులో సగం 6,250 ఒక చిన్న లడ్డు వడ ఇచ్చి ప్రోత్సహించడం ఆనవాయితీ. అదే తరహాలో నగరపాలక సంస్థ కార్మికులను ప్రోత్సహించాల్సిన బాధ్యత ఉంది అని ఆయన అన్నారు. నగర ప్రముఖులు, ఉన్నతాధికారులు,వివిధ వర్గాల ప్రజలు గంగమ్మ ఆలయానికి తీసుకువచ్చే సారే రోడ్డు మార్గాలలో ఎటువంటి వ్యర్ధాలు లేకుండా పసుపు నీళ్లతో నీటి ట్యాంకర్లతో ఎప్పటికప్పుడు పరిశుభ్రం చేయడం,అలాగే ఆలయ
ప్రాంగణంలో జంతు బలిలు జరిగిన వెంటనే రక్తపు మరకలు,దుర్వాసన లేకుండా భక్తులకు అసౌకర్యం కలగకుండా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ నిరంతరం శ్రమించారు. అందుకే నగరపాలక సంస్థలో పనిచేస్తున్న అన్ని శాఖల సిబ్బందికి ప్రతి సంవత్సరం “గంగమ్మ జాతర బహుమానం” పదివేల రూపాయలను మంజూరు చేయాలని నగరపాలక సంస్థ ఉద్యోగస్తుల,కార్మికుల తరఫున డిమాండ్ చేస్తున్నాను.
గంగమ్మ జాతర సందర్భంగా నగరంలో ఆలయ పరిసర ప్రాంతాల్లో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా,VIP ల సారే ల ఊరేగింపు కారణంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పోలీస్ బందోబస్తు పటిష్టమైన ఏర్పాట్లు చేసిన పోలీసు ఉన్నతాధికారులకు సిబ్బందికి నగర ప్రజల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని ఆయన అన్నారు.