కరోనా కారణంగా ఎన్నో కుటుంబాలు ఉపాధి లేకుండా ఇబ్బందులు పడుతుంటే వారిని ఆదుకోవాల్సింది పోయి రాష్ట్రంలోని వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెత్తపై కూడా పన్ను వసూలు చేస్తున్నదని ఎంఐఎం పార్టీ విమర్శించింది.
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన చెత్త పన్ను ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఎంఐఎం పార్టీ నేడు గుంటూరు జిల్లా నరసరావుపేట మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం చేపట్టింది. అనంతరం మున్సిపల్ కమిషనర్ ను కలసి వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్బంగా ఎంఐఎం పార్టీ నాయకులు మాట్లాడుతూ గత రెండు సంవత్సరాల నుంచి ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారని అన్నారు. దానికి తోడు కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలను విపరీతంగా పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తున్నదని వారు తెలిపారు.
ఈ సమయంలో రాష్ట్ర ప్రభుత్వం చెత్త పై పన్ను వేయడం, ఆస్తి పన్ను రెట్టింపుకన్నా ఎక్కువ చేయడం అన్యాయమని వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మూలిగే నక్క పై తాటికాయ పడిన చందంగా చెత్త పై పన్ను విధించటం ఎంత దారుణం అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలపై విధించే ఏవిధమైన పన్ను, ప్రజల జీవితాలతో చెలగాటం ఆడటమేనని ఇలాంటి పన్నులను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో ఎంఐఎం జిల్లా ప్రధాన కార్యదర్శి మస్తాన్ వలి, జిల్లా అధ్యక్షులు కరీముల్లా, పట్టణ అధ్యక్షులు మౌలాలి, నాయకులు నాసర్ వలి కరీముల్లా రెహమాన్, తదితరులు పాల్గొన్నారు.
ఎం.ఎస్.సుధాకర్, సత్యం న్యూస్