గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అత్తాపూర్ డివిజన్ నుంచి పోటీ చేస్తున్నఅధికార టీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థి చెరుకు మాధవి అమరేందర్ కు గిరిజన కుటుంబాల నుంచి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ప్రమాణం చేశారు.
శుక్రవారం రాత్రి అత్తాపూర్ పరిధిలో నిర్వహించిన ఎన్నికల ప్రచారానికి తాండూరు ప్రాంతం నుంచి వలస వెళ్లిన గిరిజనులు భారీగా తరలి వచ్చారు.
ఈ సందర్బంగా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ విట్టల్ నాయక్ తో కలిసి ఎన్నికల డివిజన్ ఇంచార్జి తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా అత్తాపూర్ కార్పొరేటర్ సీటుతో పాటు మేయర్ సీటును మళ్ళీ టీ.ఆర్.ఎస్ దక్కించుకోవడం ఖాయమన్నారు. 500 జనాభా కలిగిన గిరిజన తండాలను పంచాయతీలుగా మార్చిన ఘనత సీ.ఎం కే.సీ.ఆర్ కే దక్కిందన్నారు.
సేవాలాల్, భవానిమాతలను ఎక్కువగా ఆరాధించే గిరిజనుల కోసం రూ.5 కోట్లతో బంజారాహిల్స్ లో బంజారా భవన్ నిర్మాణం చేపట్టామన్నారు. అత్తాపూర్ కార్పొరేటర్ అభ్యర్థి చెరుకు మాధవి గెలుపునకు గిరిజనులు ఏకం కావడం సంతోషంగా ఉందన్నారు. భారీ సంఖ్యలో తాండూరు ప్రాంతానికి చెందిన వలస గిరిజనులు తరలిరావడం పట్ల ఆనందంగా ఉందన్నారు. తాండూరు ప్రాంతంలోని నీళ్లపల్లి, సూర్యనాయక్ తండాకు చెందిన సుమారు 2 వేల కుటుంబాలు ఇక్కడ ఉన్నాయన్నారు.
గిరిజనులు, పేద, మధ్య తరగతి వారి సంక్షేమానికి కృషి, ప్రాధాన్యత ఇస్తున్నటీ.ఆర్.ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం ‘కారు’ గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో తాండూరు ఏ.ఎం. సీ చైర్మన్ విట్టల్ నాయక్, టీ.ఆర్.ఎస్ సీనియర్ నాయకుడు, ఎమ్మెల్యే తండ్రి విట్టల్ రెడ్డి, యాలాల ఎం. పీ.పీ బాలేశ్వర్ గుప్త, కో-ఆప్షన్ మెంబర్ అక్బర్ బాబా, ప్రముఖ డాక్టర్ సంపత్ కుమార్, గిరిజన నాయకులు దామర్ చెడ్ రాములు నాయక్, మోహన్ సింగ్ తదితరులు ఉన్నారు.