2024 ఎన్నికల్లో తిరుగులేని మెజార్టీతో గెలుపొందాలని గిద్దలూరు ఇన్చార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డికి పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సూచించారు. బుధవారం మంగళగిరిలోనే జాతీయ పార్టీ కార్యాలయంలో చంద్రబాబు నాయుడు గిద్దలూరు నియోజకవర్గ ఇంచార్జ్ ముత్తుముల అశోక్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అధినేత చంద్రబాబు గిద్దలూరు నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు తదితర అంశాలపై చర్చించారు. వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో విజయం సాధించేలా ఇప్పటి నుండే కృషి చేయాలని సూచించారు. అన్నీ క్యాడర్ల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలన్నారు. ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలో టిడిపిపై ప్రజల్లో ఆదరణ పెరిగిందన్నారు.
ప్రత్యర్థి తీరుపై నియోజకవర్గ ప్రజలంతా అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తోందన్నారు. ఈ క్రమంలో టిడిపి ఇంకా బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. గ్రామ స్థాయి నుండి టిడిపిని పటిష్టం చేసేందుకు క్యాడర్ పని చేయాలన్నారు. అన్నీ క్యాడర్ల నాయకులను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. అలాగే పార్టీ సభ్యత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బూత్ స్థాయి కమిటీలు అన్నీ డివిజన్లలో నియోజకవర్గ కార్యకర్తలు అందరూ సమన్వయంతో పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. ఇప్పటి వరకు పార్టీ కార్యక్రమాలను గిద్దలూరు నియోజకవర్గంలో విజయవంతంగా నిర్వహించారన్నారు. ఇదే ఉత్సాహంతో భవిష్యత్తులో కూడా పని చేయాలన్నారు.
ప్రభుత్వ వైఫల్యాలను విస్తృతంగా ప్రజల్లో తీసుకెళ్లి, ప్రజల్లో మనోధైర్యం నింపాలన్నారు. నిరంతరం ప్రజల మధ్యే ఉంటూ సమస్యలపై పోరాడాలన్నారు. రానున్న ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గం టిడిపికి కంచుకోటగా మార్చాలని చంద్రబాబు నాయుడు ముత్తుములకు సూచించారు.