కామారెడ్డి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు చేస్తున్న ఉద్యమానికి ఆయా పార్టీల నేతలు మద్దతు తెలపడం సంతోషమని బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ ఇంచార్జి కాటిపల్లి వెంకట రమణారెడ్డి అన్నారు. కాకపోతే ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ రైతులను పెయిడ్ వర్కర్లు అన్నట్టుగా నాయకులు తోచిన విధంగా సహాయం చేసి ఆ మాట నిజం చేయవద్దని, రైతుల ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలవాలన్నారు.
మాస్టర్ ప్లాన్ రద్దు కోసం రైతులు న్యాయస్థానం ద్వారా పోరాటానికి సిద్ధమయ్యారని, ఇప్పటికే 558 మంది రైతులు అడ్వకేట్ ద్వారా అధికారులకు నోటీసులు పంపించారని, ప్రస్తుతం మరికొంత మంది రైతులు దరఖాస్తులు కూడా వచ్చాయన్నారు. మాస్టర్ ప్లాన్ బాధిత రైతులకు న్యాయం జరగడం కోసం చేస్తున్న పోరాటానికి ఖర్చుల కోసం మద్దతు తెలిపే నాయకులు తనతో పాటు ఏనుగు రవీందర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, మదన్ మోహన్ రావు, షబ్బీర్ అలీలు ఒక్కొక్కరు 10 లక్షలు రైతులకు ఇవ్వాలన్నారు. వీరితో పాటు ఎల్లారెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యేలు కూడా రైతులకు అండగా నిలబడి 10 లక్షల చొప్పున ఇస్తామంటే సంతోసిస్తామన్నారు.
ఈ డబ్బులు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఖర్చు చేయడం జరుగుతుందని, ప్రతి పైసా లెక్కలు వెల్లడిస్తారన్నారు. అలాగే మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటిస్తే తనకు ఎక్కడ పేరు వస్తుందోనని కామారెడ్డి ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కు ఏదైనా అనుమానం ఉంటే వారం రోజుల పాటు ఈ ఉద్యమానికి తాను దూరం ఉంటానని, ఎమ్మెల్యే గంప గోవర్ధన్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తున్నట్టు ప్రకటించిన మరుక్షణమే ఓ రైతుగా తాను ఆయనకు పాలాభిషేకం చేస్తానన్నారు.