కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తున్న ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో అహర్నిశలూ శ్రమిస్తూ రోగులకు ఉత్తమ సేవలందించటమే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని ఏపీలోనిఉత్తరాంద్ర లో విజయనగరం జిల్లా కలెక్టర్ డా.ఎం. హరిజవహర్ లాల్ పిలుపునిచ్చారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటూ తక్షణ సేవలందించాలని సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో 104 కాల్ సెంటర్ ద్వారా అందుతున్న సేవలు చాలా కీలకమని పేర్కొన్నారు.
మరింత బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ సేవలను విస్తృతపరచాలని హితవుపలికారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఏర్పాటు చేసిన కోవిడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 104 కాల్ సెంటర్ను బలోపేతం చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా వస్తున్న ఫోన్ కాల్స్కు సిబ్బంది వెంటనే స్పందిస్తూ సేవలందిస్తున్నారు. ఇక్కడ అందుతున్న సేవలను మరింత విస్తృతపరిచి కరోనా రోగులకు అండగా ఉంటామని కలెక్టర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. టెస్టులకు సంబంధించిన వివరాలను ఎప్పటికప్పుడు అందిస్తున్నాం, పాజిటివ్ వచ్చిన వారికి కాల్ చేసి హోం ఐసోలేషన్ లో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
నిర్వహణలో జాప్యం వద్దు-జిల్లాలో 250 అదనపు బెడ్ల కేటాయింపు…!
టెస్టుల నిర్వహించి ఫలితాలు ఇవ్వటంలో తలెత్తుతున్న సమస్యకు కలెక్టర్ పరిష్కార మార్గాన్ని సూచించారు. ల్యాబ్లకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో ఆర్టీపీసీఆర్ టెస్టులు చేయాలని డీఎం & హెచ్వోని ఆదేశించారు. అలాగే ల్యాబ్లకు దూరంగా ఉన్న ప్రాంతాల్లో ర్యాపిడ్ టెస్టులు చేయాలని చెప్పారు. ఇలా చేయటం ద్వారా ఫలితాల వెల్లడిలో జాప్యాన్ని నివారించవచ్చని పేర్కొన్నారు.
తక్షణమే సంబంధిత అధికారులకు ఈ సమాచారాన్ని తెలియజేయాలని కలెక్టర్ సూచించారు. ఫలితాలు త్వరితగతిన ఇచ్చేందుకు చాకచక్యంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. కరోనా రోగుల నిమిత్తం జిల్లాలోని కోవిడ్ ఆసుపత్రుల్లో అదనంగా 250 బెడ్లు కేటాయిస్తూ కలెక్టర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా కేంద్రాసుపత్రిలో 100 పడకలు, మిమ్స్లో 100 పడకలు, పార్వతీపురం ఏరియా ఆసుపత్రిలో 50 పడకలు అదనంగా అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు త్వరితగతిన చేయాలని సంబంధితన అధికారులను ఆదేశించారు. జర్మన్ హ్యాంగర్స్ ఏర్పాటు చేయాల్సిందిగా రహదారుల భవనాల శాఖ అధికారులకు ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు.