‘‘గ్లాసు’’ ఈ గుర్తును తలచుకుంటే కమలనాథులకు చెమటలు పడుతున్నాయి. అదేమిటి? అది వారి మిత్రపక్షమైన జనసేన ఎన్నికల గుర్తే కదా అని అనుకుంటున్నారా?
మిత్రపక్షమైన జనసేన గుర్తే కానీ ఇప్పుడు జరుగుతున్న తిరుపతి లోక్ సభ ఉప ఎన్నికలో ఆ గుర్తు నవతరం పార్టీ అభ్యర్ధికి వచ్చింది. దాంతో జన సేన పార్టీ గుర్తు ఇప్పుడు బిజెపికి పక్కలో బల్లెంలా తయారైంది.
తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీ, జనసేన పార్టీలో ఉమ్మడి అభ్యర్థిని రంగంలోకి దింపిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో జనసేనాని కూడా పాల్గొంటున్నారు. పవన్ రావడంతో బీజేపీలో కొత్త ఆశలు చిగురించాయి.
ఇంతలోనే ఆ పార్టీ గాజు గ్లాసు రూపంలో ఉపద్రవం వచ్చి పడింది. తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో గాజు గ్లాసు గుర్తు వివాదం రేగుతోంది. తిరుపతి ఉప ఎన్నికలో బీజేపీకి కొత్త తలనొప్పి వచ్చి పడింది. జనసేన ఎన్నికల గుర్తు అయిన గాజుగ్లాసును నవతరం పార్టీకి ఎన్నికల కమిషన్ కేటాయించింది.
దీంతో జనసేన ఓట్లు క్రాస్ అవుతాయని బీజేపీ ఆందోళన చెందుతోంది. ఎందుకంటే జనసేన గుర్తింపు పొందిన రాజకీయ పార్టీగా ఇంకా హోదా రాలేదు. ఈ ఎన్నికల్లో బీజేపీకి టికెట్ ఇవ్వడంతో ఇక్కడ పోటీ చేయడం లేదు.
ఈ నేపథ్యంలో నవతరం పార్టీ అభ్యర్థి గోదా రమేష్ కుమార్ కు గాజు గ్లాసు గుర్తు కేటాయించారు. ఇప్పటికే జనసేనాని ఎంట్రీతో ఊపు వచ్చిందని అనుకుంటున్న బీజేపీకి ఈ వార్త షాకిచ్చింది. జనసేన పార్టీ ఎన్నికల గుర్తు గాజు గ్లాసును ఎన్నికల గుర్తుగా కేటాయించడంపై ఆ పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
జనసేన అధ్యక్షుడు పవన్ బీజేపీతో పొత్తు పెట్టుకున్నందున తమ పార్టీ అభ్యర్ధికి గాజుగ్లాసు గుర్తు కేటాయించారని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వివరణ ఇచ్చారు.