తిరుపతి మహతి కళాక్షేత్రంలో అక్టోబరు 30 మరియు 31 వ తేదీల్లో నిర్వహించనున్న గో మహా సమ్మేళనం ఏర్పాట్లపై టీటీడీ ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి సోమవారం సమీక్ష జరిపారు.
టీటీడీ పరిపాలన భవనంలోని తన చాంబర్లో ఆయన సమ్మేళనం ఏర్పాట్ల గురించి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. ఏ ప్రాంతం నుంచి ఎంతమంది స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, రైతులు వస్తున్నారనే వివరాలు సిద్ధం చేయాలన్నారు. సమ్మేళనానికి హాజరవుతున్న ముఖ్యులతో స్వయంగా మాట్లాడాలని
జెఈవో వీరబ్రహ్మం కు ఆయన సూచించారు. స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధితులకు తిరుమలలోని మఠాలు, వివిధ ప్రాంతంలోనూ, రైతులు, ఇతర ప్రతినిధులకు తిరుపతిలోని శ్రీనివాసం, శ్రీ పద్మావతి నిలయంతో పాటు రెండు మరియు మూడవ సత్రాల్లో వసతి ఏర్పాటు చేయడానికి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
గో మహా సమ్మేళనానికి ఇప్పటివరకు 27 మంది స్వాములు వస్తున్నట్టు సమాచారం ఇచ్చారని జేఈవో తెలిపారు. వేదిక వద్ద, మహతి లోని ప్రవేశ మార్గాల వద్ద పూర్తిస్థాయిలో శానిటైజర్ లు మాస్కులు ఏర్పాటు చేయాలని ఈవో ఆదేశించారు. సమ్మేళనం నిర్వహణ కోసం కోఆర్డినేషన్, వసతి, రిసెప్షన్, స్టేజి, మీడియా మరియు పబ్లిసిటీ, ఫుడ్, హాస్పిటాలిటీ, రవాణ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎగ్జిబిషన్, డయాస్, సెక్యూరిటీ, హెల్త్ అండ్ శానిటేషన్ లాంటి 25 కమిటీలను నియమించామని వీరబ్రహ్మం వివరించారు.