సిపిఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరిక
ప్రజాస్వామ్యబద్దంగా ప్రభుత్వాలు చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రశ్నించే గొంతుకులను నులిమెసేందుకు సీఎం జగన్ ప్రభుత్వం అడ్డదారుల్లో ఓ చీకటి జీఓ ని తీసుకొస్తే ప్రజాపోరాటలు ఆపే ప్రసక్తే లేదని సిపిఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ ( సిపిఐ ) విజయనగరం నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా విజయనగరం అమర్ భవన్ ముందు వేసిన భోగి మంటల్లో చీకటి జీఓ 1 ప్రతులను దగ్ధం చేసారు. ఈ సందర్భంగా బుగత అశోక్ మీడియాతో మాట్లాడుతూ భారత దేశం ఎంతో పవిత్రంగా భావించే రాజ్యాంగాన్ని కేంద్రంలో మోడీ, రాష్ట్రంలో జగన్ ఇద్దరూ కలిసి తుంగలోకి తొక్కి ప్రజాస్వామ్యాన్ని హక్కుల్ని కలరాస్తే తప్పులేదు కానీ ప్రజలకి జరుగుతున్న అన్యాయం పై ప్రభుత్వాలను ప్రశ్నించే వారిని నిర్బంధాలకి గురిచేయడానికి అడ్డదారుల్లో చట్టసభల్లో చేస్తున్న చీకటి జీవో వెనక్కి తీసుకోవాలని నిరసన వ్యక్తం చేస్తే తప్పేమిటని ప్రశ్నించారు.
శాంతియుతంగా జరుగుతున్న ఉద్యమాలను ప్రభుత్వాలే రెచ్చగొట్టేందుకే ప్రభుత్వాలు ఇలాంటి అణచివేత జీఓ లను తెస్తున్నాయని మండిపడ్డారు. అరచేతిని అడ్డం పెట్టి సూర్యకాంతిని ఆపాలని అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ప్రజలు, కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారానికి చేస్తున్న ఉద్యమాలను ఆపాలని అనుకోవడం కూడా అంతే తెలివితక్కువతనం అని ఎద్దేవాచేశారు.
75 ఏళ్ల స్వాతంత్ర్య భారతదేశ చరిత్రలో రాష్ట్ర ప్రభుత్వాలు గాని కేంద్ర ప్రభుత్వం కానీ ప్రజల బావా ప్రకటన స్వేచ్ఛను హరించే ఇలాంటి చీకటి జీవో ను తీసుకు రాలేదని ఈ ఘనత నియంతృత్వ ధోరణిలో పాలన సాగిస్తున్న పీఎం మోడీ, సీఎం జగన్ లకే దక్కుతుందని వారు విమర్శించారు.
బ్రిటిష్ కాలంలో 1861 లో ఆనాటి స్వాతంత్ర పోరాట యోధులను అణచివేయడానికి తీసుకొచ్చిన సెక్షన్ 30 ప్రకారం కూడా ప్రభుత్వాలు రోడ్ షోలకు కానీ ర్యాలీలు కానీ అనుమతి ఇవ్వాలని ఉంది కానీ జగన్ మోహన్ రెడ్డి తీసుకొచ్చిన జీవో 1 ప్రకారం అనుమతి ఇవ్వకూడదని ప్రజలు పెట్టుకునే అర్జీని కూడా తిరస్కరించాలని జీవోలో స్పష్టంగా ఉందని తెలిపారు. ఇది రాజ్యాంగ మనకు కల్పించిన ఆర్టికల్ 19 కు పూర్తిగా విరుద్ధమైనదని వారు అన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా జీవోను తీసుకొచ్చిన జగన్మోహన్ రెడ్డికి రాష్ట్రాన్ని పాలించే హక్కు లేదని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితులలో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకునే అంతవరకు ఈ పోరాటం కొనసాగుతుందని వారి హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎస్. రంగరాజు, బాయి రమణమ్మ, బుగత పావని, జిల్లా సమితి సభ్యులు పురం అప్పారావు, ఎఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఎస్. సునీల్, జిల్లా ఉపాధ్యక్షుడు గౌరీశంకర్, విశాలాంధ్ర బుక్ హౌస్ ఇన్ఛార్జ్ సయ్యద్ ఇబ్రహీం, నియోజకవర్గ సభ్యులు ఏ.రాములు, అప్పురుబోతు జగన్నాధం తదితరులు పాల్గొన్నారు.