రాష్ట్ర ప్రభుత్వ ప్రతిష్ఠకు భంగం కలిగించే వార్తా కథనాలను పత్రికల్లో ప్రచురించడం, ప్రసార మాధ్యమాల్లో ప్రసారం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో ఆర్టీ నంబర్ 2430 ను సవాలు చేస్తూ హైకోర్టులో దాఖలైన రిట్ పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది.
ఇటువంటి వార్తా కథనాలపై ఆయా ప్రభుత్వ శాఖల కార్యదర్శులకు చట్టప్రకారం రీజాయిండర్ లు విడుదల చేసేందుకు, అవసరమైన పక్షంలో కేసులు నమోదు చేసేందుకు అధికారాలు కల్పించామని సమాచార పౌర సంబంధాల శాఖ హైకోర్టుకు వివరణ ఇచ్చింది. ఈ జీవో కేవలం క్రిమినల్ చర్యకు ఉద్దేశించినది కాదని పేర్కొన్న వివరణను కూడా హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.
పత్రికాస్వేచ్ఛను పరిమితం చేయడంగానీ, సమాచార సేకరణకు అనుమతి నిరాకరించడం గానీ, ప్రచురణ, పంపిణీ స్వేచ్ఛలను అరికట్టడం గానీ జీవో ఉద్దేశం కాదని ప్రభుత్వం చెప్పింది. నైతిక విలువలతో కూడిన బాధ్యాతాయుతమైన వార్తా కథనాల ప్రచురణ ఈ జీవో ప్రధాన ఉద్దేశమన్న ప్రతివాదుల సమాధానాన్ని హైకోర్టు వారు పరిగణలోకి తీసుకొని తీర్పు వెల్లడించింది.