జగిత్యాల జిల్లా ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో జరిగిన “గోదావరి హారతి” కార్యక్రమంలో నేడు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పాల్గొన్నారు. కార్తీకమాసం అమావాస్య సందర్భంగా ముగింపు ఉత్సవాల్లో భాగంగా బుధవారం సాయంత్రం గోదావరి తీరంలో గోదావరి హారతి నిర్వహించారు. దేవస్థానం వద్ద నుండి మంగళవాద్యాలు తోడు రాగా, గోదావరి నదికి ఊరేగింపుగా వెళ్ళారు. ఈ సందర్భంగా గోదావరి తీరంలోని మంగలిగడ్డ పుష్కర ఘాట్ వద్ద ఏర్పాటు చేసిన వేదికపై స్వామివార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.
గోదావరి నదీ మాతకు మంగళ హారతి, మంత్రపుష్ప నీరాజనాది క్రతువులు నిర్వహించిన అనంతరం సనాతన సాంప్రదాయ రీతిలో నదినీటిలో కార్తీక దీపాలను దొప్పలలో వెలిగించి గోదావరి మాత కు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా డిసిఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, స్థానిక నాయకులు,ఆలయ అధికారులు పాల్గొన్నారు.