ఖమ్మం నగరంలో బంగారం వ్యాపారిని ఒక దుండగుడు నిలువునా దోచుకున్నాడు. విజయవాడకు చెందిన బంగారం వ్యాపారి శ్రీపాల్ జైన్ గత రెండేళ్లుగా విజయవాడ నుంచి బంగారం తీసుకొచ్చి ఖమ్మంలో వ్యాపారులకు సరఫరా చేస్తుంటాడు.
ఎప్పటిలాగే ఉదయం 9:30 గంటలకు అతను గోల్కొండ రైలులో ఖమ్మం చేరుకున్నాడు. ఖమ్మంలో వ్యాపార లావాదేవీలు పూర్తి చేసుకుని రాత్రి 8:00 గంటలకు శాతవాహన రైలులో విజయవాడ వెళ్లేందుకు కమాన్ బజార్లోని రైల్వే గేటు నుంచి స్టేషన్కు ట్రాక్పై నడుచుకుంటూ వెళ్తున్నారు.
రాత్రి 7:45 సమయంలో నిత్యం రద్దీగా ఉండే ఆ స్థలంలో అకస్మాత్తుగా ఓ వ్యక్తి వచ్చి అతనిపై దాడి చేశాడు. ముఖంపై కారం చల్లి పిడిగుద్దులు గుద్దాడు. అతడిని అడ్డుకునే సమయంలో ఛాతిపై కత్తితో గాయం చేశాడు. చేతిలోని సంచిని గట్టిగా పట్టుకోగా మోచేతిపై కత్తితో గాయపరిచి సంచి తీసుకుని పారిపోయాడు.
అతని వద్ద ఉన్న 600 గ్రాముల బంగారం, రూ.లక్ష దుండగుడు దోచుకెళ్లాడు. ఈ దోపిడీలో ఇద్దరు వ్యక్తులు పాల్గొని ఉంటారని అనుమానిస్తున్నారు. పోలీసులు వెంటనే బంగారం వ్యాపారిని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.