ఏపీలో కొత్త ప్రభుత్వం మహిళలకు గుడ్ న్యూస్ వినిపించింది. డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి నడుం బిగించింది. సంక్షేమంతో పాటు సమానంగా అభివృద్ధిని కూడా రెండు కళ్లుగా రాష్ట్రాన్ని ప్రగతి బాట పట్టిస్తామని ముఖ్యమంత్రి గత ఎన్నికల ముందు నుంచి చెబుతూ వస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పుడు డ్వాక్రా మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారు. మహిళలకు వివిధ పథకాల కింద పెద్ద ఎత్తున రుణాలు అందించడం కోసం చర్యలు మొదలుపెట్టింది. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, ఉన్నతి పథకాల ద్వారా మహిళలకు రూ.లక్షల్లో లబ్ధి చేకూర్చనుంది ప్రభుత్వం.
ఇందులో భాగంగా జిల్లాలోని సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. రుణాల మంజూరుకు అర్హులైన సభ్యుల నుంచి వివరాలు కూడా సేకరిస్తున్నారు. మహిళా సంఘాలకు కేటాయించిన గ్రేడింగ్ ఆధారంగా రుణ మంజూరు చేయనున్నారు. గ్రేడ్-ఎలో ఉంటే రూ.75 లక్షలు, గ్రేడ్-బిలో ఉంటే రూ.65 లక్షలు, గ్రేడ్-సిలో అయితే రూ.55 లక్షలు, గ్రేడ్-డిలో ఉంటే రూ.45 లక్షలు మంజూరు చేస్తారు. సభ్యురాలు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే తీసుకున్న రుణాన్ని పూర్తిగా మాఫీ చేయబోతున్నారు.
వైసీపీ ప్రభుత్వం ఉండగా పొదుపు సొమ్ము జమ చేయడంలోనూ అనేక అవకతవకలు జరిగాయి. ఈ నేపథ్యంలో కూటమి కొత్త ప్రభుత్వం నగదు రహిత లావాదేవీలు ప్రోత్సహించేలా మార్పులు చేసింది. గతంలో వీవో అకౌంట్లలో పొదుపు సొమ్ము జమ చేసేవారు. పలుచోట్ల పక్కదారి పట్టినట్లు ఎన్నో కంప్లైంట్లు వచ్చాయి. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఈసారి నగదు రహిత లావాదేవీలను అధికారులు ప్రోత్సహిస్తున్నారు. ఇందులో భాగంగానే వీవోఏలకు పేటీఎం డివైజ్లను అందజేయబోతున్నారు.
వైసీపీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు రూపాయి కూడా అందించకపోవడంతో.. ఇప్పుడు ఉన్నతి పథకం ద్వారా వడ్డీ లేకుండా వారికి రుణాలు ఇవ్వనున్నారు. ఇతరుల మాదిరిగానే వెలుగు, సామాజిక పెట్టుబడి నిధి, అంతర్గత రుణాలను మంజూరు చేయనున్నారు. ఇక నుంచి అన్ని పత్రాలు సక్రమంగా ఉంటే రుణాల కోసం దరఖాస్తు చేసిన 24 గంటల్లోనే లోన్లు అందజేయబోతున్నారు. ఒక్కో సంఘానికి రూ.3 లక్షల నుంచి రూ.20 లక్షల వరకూ రుణం మంజూరు చేస్తున్నారు.