నిర్మల్ జిల్లాలోని సారంగాపూర్ మండల్ కు చెందిన మహేష్ (22) గత నెల 6 న పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. ఈ నేపథ్యంలో బాధితుడిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి అడ్మిట్ చేశారు. అప్పటికే బాధితుడికి ఆక్సిజన్ లెవెల్ 20- 25 గా ఉంది.
శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉంది. పరీక్షించిన విద్యా సిబ్బంది 41 రోజులు కష్టపడి బాధితుడిని సంపూర్ణ ఆరోగ్యవంతుడిని చేసి మంగళవారం డిశ్చార్జ్ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ దేవేందర్ రెడ్డి మాట్లాడారు.
సారంగాపూర్ చెందిన మహేష్ గత నెల పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి వెళ్లారని ఆస్పత్రికి చేరుకునేసరికి బాధితుడికి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉందని,గుండె, ఊపిరితిత్తుల కూడా పని చేయడం కష్టంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలో ఐసియు సిబ్బంది, డాక్టర్ రత్నాకర్ వైద్య పరీక్షలు చేశారు.
నోటి ద్వారా ఊపిరితిత్తులకు పైపు వేసి కృత్రిమ శ్వాస అందించారు. వెంటిలేటర్ పై 41 రోజులు వైద్యులు నిరంతరం శ్రమించి చికిత్స అందించిన తర్వాత ఇప్పుడు పూర్తిగా కొలుకొని తన పని తాను చేసుకునే స్థితికి వచ్చాడన్నారు. బాధితుడికి చికిత్స అందించిన వైద్యలను, ఐసియు సిబ్బందిని అభినందించారు.