ఎంపీపీ పదవి ఇస్తానని చెప్పి వెన్నుపోటు పొడిచిన వైసీపీ నాయకులకు ధన్యవాదాలు తెలిపిన ఒక గ్రామస్థాయి నాయకుడు వైసీపీ కండువా విసిరేసి వెళ్లిపోయిన సంఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.
కర్నూలు జిల్లా కోడుమూరు నియోజకవర్గ వైసీపీ నాయకులు ఎంపీటీసీ లక్కిరెడ్డి రాజమ్మ కు ఎంపీపీ పదవి ఇస్తామని చెప్పారట. అయితే తర్వాతి పరిణామాలలో ఆమెకు ఆ పదవి ఇవ్వకుండా మోసం చేశారు.
దాంతో వైసీపీ చేసిన మోసాన్ని తట్టుకోలేక కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, కర్నూలు మేయర్ బీవై రామయ్యకు ఆమె కుమారుడు నరసింహారెడ్డి పాదాభివందనం చేసి మరీ పార్టీ కండువా విసిరి కొట్టారు.
పదవి లేకపోతే కూలీనాలీ చేసుకుని బతుకుతామని అంతే కానీ మోసం తట్టుకోలేమని ఆయన ఎంతో ఆవేదనగా చెప్పారు. ఎమ్మెల్యే కాళ్ళు మొక్కి వైసీపీ కండువా విసిరేసి మీకు, వైసీపీ పార్టీకి దండం అంటూ ఆయన వెళ్లిపోయాడు.