ఈ సంవత్సరం సంప్రదాయం ప్రకారం మొహర్రం జరుగుతుందని హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ ప్రకటించారు. గత సంవత్సరం కరోనా కారణంగా మొహర్రం వేడుకలకు అనుమతి ఇవ్వలేదని ఆయన చెప్పారు.
మొహర్రం ఏర్పాట్ల పై నేడు మంత్రులు ముందస్తు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హోం మంత్రి తో బాటు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. హైదరాబాద్ లోని మాసబ్ ట్యాంక్ లోని DSS భవన్ లో మొహర్రం ఏర్పాట్ల పై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సమావేశంలో మంత్రులు మాట్లాడుతూ కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయామని తెలిపారు. ఈ సారి ఆంక్షలు లేవుకాబట్టి అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు. షియా సంస్థల ప్రతినిధులకు ఈ మేరకు హామీ ఇస్తున్నట్లు మంత్రులు తెలిపారు.
యాకుత్పురా ఎమ్మెల్యే అహ్మద్ పాషా ఖాద్రి, MLC రియాజ్ ఉల్ హసన్ ఎఫండి సమావేశంలో పాల్గొన్నారు. ప్రభుత్వ సలహాదారు AK ఖాన్ పోలీసు, ఆరోగ్యం, వైద్యం, అగ్నిమాపక సేవలు, నీరు, విద్యుత్, మునిసిపాలిటీలు, ఇతర విభాగాల సన్నాహాలను సమీక్షించారు.
ఈ సమావేశంలో ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్, వక్ఫ్ బోర్డ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షానవాజ్ ఖాసిం, సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్ సభ్యుడు హనీఫ్ అలీ, రాష్ట్ర వక్ఫ్ బోర్డు సభ్యుడు డాక్టర్ నిసార్ అఘా, వివిధ షియా సంస్థల నాయకులు పాల్గొన్నారు.