కరోనా కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర నాయకులు, మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కేంద్రంలో సోమవారం విలేకరులతో మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా 8.5 లక్షల కరోనా కేసులు నమోదయ్యాయని వైరస్ నియంత్రణకు ప్రాధాన్యత ఇవ్వక పోవడం దేశ ప్రజల దురదృష్టకరమని అన్నారు.
కరోనా కట్టడి తమ భాద్యత కాదన్నట్లుగా వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రజలు కరోనా వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని ప్రజల మీదికి నెట్టేసి నిమ్మకు నీరెత్తినట్లు పాలకులు కూర్చున్నారని దుయ్యబట్టారు. గవర్నర్ భవనం, ప్రగతి భవనం, మంత్రులు, ఎమ్మెల్యే లు ఇలా ఉన్నత స్థానాల్లో ఉన్నవారిని సైతం కరోనా కాటేస్తుంటే కట్టడి చర్యలు తీసుకోకుండా గాలికి వదిలేయడం విడ్డూరంగా ఉందని అన్నారు.
ఆదుకోక పోగా ధరలు పెంచి నడ్డి విరుస్తున్నారు
కరోనా తో సామాన్యుల ఆర్థిక పరిస్థితి కకా వికలమైతే వారిపై పన్నుల భారం మోపుతున్నారని, ధరలు పెంచుతూ వారి నడ్డి విరుస్తున్నారని అన్నారు. కరోనా కట్టడి అయ్యేంత వరకు అర్హులైన వారికి నెలకు రూ. 7,500, ఉచితంగా బియ్యం, పప్పు దినుసులు అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
కరోనా వైరస్ అదుపు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందడాన్ని నిరసిస్తూ ఈ నెల 16న మండల, జిల్లా కేంద్రాలలో ఒక్క రోజు దీక్ష చేపట్టనున్నట్లు రంగారెడ్డి తెలిపారు. ఈ సమావేశంలో పార్టీ జిల్లా నాయకులు జిట్టా నగేష్, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, నాయకులు నారబోయిన శ్రీను పాల్గొన్నారు.