ప్రజారోగ్య పరిరక్షణలో ప్రభుత్వం విఫలమైందని ఏఐసీసీ కార్యదర్శి చల్లా వంశీచంద్రెడ్డి విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ప్రైవేటు ఆస్పత్రులపై నియంత్రణ కరువైందని, వైద్యం అందకపోవడం వల్ల సర్కారు దవాఖానాలపై ప్రజలకు నమ్మకం పోయిందని ఆయన అన్నారు.
టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక కొత్తగా ఒక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కూడా ప్రారంభించలేదని ఆయన అన్నారు. మన రాష్ట్రంలో అదనంగా మరో 60 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 125 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు అవసరమని వంశీచంద్ రెడ్డి చుప్పారు. ప్రజారోగ్యం పట్ల సర్కారు నిర్లక్ష్య వైఖరిని తప్పుపడుతూ హైకోర్టు 2018లోనే ప్రభుత్వాన్ని మందలించిందని ఆయన గుర్తుచేశారు.
ఉస్మానియా, గాంధీ, వరంగల్ లోని ఎమ్.జీ.ఎమ్ లాంటి బోధనాసుపత్రుల పర్యవేక్షణ చూసే డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్లో 70 శాతానికి పైగా వైద్యుల పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలోని ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలలో, కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలలో, ఏరియా ఆసుపత్రులలో దాదాపు 40 శాతం ఖాళీలు భర్తీ కావలసి ఉందని చెప్పారు.
పరీక్షలు పూర్తైనా దాదాపు 5 వేల పారామెడికల్ పోస్టులకు మూడు సంవత్సరాలు గడిచినా నియామకాలు చేపట్టని అసమర్ధ ప్రభుత్వం ఇది అని విమర్శించారు. ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి ప్రభుత్వం పరోక్షంగా సహకరిస్తుందని ఆరోపించారు.
గవర్నర్ స్వయంగా కోరినా, కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చక పోవడం ప్రభుత్వ నిర్లక్ష్య, నియంతృత్వ ధోరణికి నిదర్శనమని మండిపడ్డారు. కోట్లాది ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న కేసీఆర్కి ప్రజలే బుద్ధి చెబుతారని వంశీచంద్రెడ్డి హెచ్చరించారు.