కరోనా నియంత్రణలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా విఫలమైనారని ఏఐసీసీ కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే చల్లా వంశీచంద్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం, ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత వల్ల కరోనా ఆటంబాంబుగా మారిందని ఆయన అన్నారు. హైద్రాబాద్ వల్లకాడుగా మారిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజారోగ్య పరిరక్షణ కన్నా మద్యం అమ్మకాలు, అధిక కరెంటు బిల్లులపైనే ప్రభుత్వం శ్రద్ధ చూపుతున్నదని ఆయన అన్నారు.
అనేకసార్లు హైకోర్టు తప్పుబట్టినా కరోనా అదుపు చేసే విషయంలో ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని వంశీచంద్ రెడ్డి అన్నారు. తక్షణమే కోవిడ్ చికిత్సను ఆరోగ్యశ్రీ లో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. సెక్రటేరియట్ ను కూలగొట్టకుండా తక్షణమే కోవిడ్ హాస్పిటలుగా మార్చాలని ఆయన డిమాండ్ చేశారు. కోవిడ్ టెస్టుల సంఖ్య పెంచి ఉచితంగా చేయాలని ఆయన కోరారు.