ఖమ్మం నగరాభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించడం వల్లే ఇంతటి అభివృద్ధి సాధ్యమైందని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు.
ఆదివారం ఖమ్మంలో జరిగిన కార్పోరేటర్ల అభినందన సభలో మంత్రి పువ్వాడ ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు. ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ పాలకమండలి ప్రజల కోసం ఈ ఐదేళ్లు అద్భుతంగా పని చేసిందని కితాబు ఇచ్చారు.
కార్పోరేటర్ల కృషి మరువలేమని నగర సుందరరీకరణలో మీ వంతు కృషి చేశారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఖమ్మం అభివృద్ధికి ఎంతో సహకరించారని, ఒక్కో డివిజన్ లో కోట్ల రూపాయల అభివృద్ధి జరిగిందన్నారు.
సీఎం కేసీఆర్ చొరవతో నగరానికి అదనపు నిధులు సమకూరాయన్నారు. ప్రజలను మెప్పించడంలో కార్పోరేటర్లు బాగా పని చేశారన్నారు మంత్రి పువ్వాడ. ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు బద్నాం చేసిన సందర్భంలోనూ ఎమ్మెల్సీ గా పల్లా రాజేశ్వరరెడ్డి గెలుపు కోసం అద్బుతంగా పని చేశారని కొనియాడారు.
ప్రతిపక్షాలన్నీ ఏకమైనా ఏమీ చెయ్యలేని స్థితిలో ఖమ్మం టీఆర్ఎస్ పార్టీ ఉందన్నారు. రాబోయే ఎన్నికల్లో ఖమ్మం కార్పోరేషన్ లో టీఆర్ఎస్ భారీ విజయం సొంతం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ గెలుపు , ప్రభుత్వ ప్రతిష్ట ముఖ్యమని కార్పోరేటర్లను ఉద్దేశించి అన్నారు.
అనంతరం మాజీ కొర్పొరేటర్ లను మెమోంటో ఇచ్చి , శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, సుడా చైర్మన్ విజయ్, మాజీ మేయర్ పాపాలాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళి, తెరాస జిల్లా పార్టీ కార్యాలయ ఇంచార్జి RJC కృష్ణ, తాజా మాజీ కార్పొరేటర్లు పాల్గొన్నారు.