ప్రత్యేక రాష్ట్రం వస్తే దీనస్థితిలో దివ్యాంగుల కుటుంబాల జీవితాలు మారుతాయనుకుంటే దివ్యాంగుల దినోత్సవాన్ని మాత్రమే ఆర్భాటాలతో నిర్వహించి తెలంగాణ ప్రభుత్వం చేతులు దులుపుకుంటుందని దివ్యాంగుల హక్కుల వేదిక వ్యవస్థాపకులు, తెలంగాణ ఉద్యమ కారుడు రాయబారపు రమేష్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమానికి నిధులు కేటాయించకుండా నిర్లక్ష్యపు భావనతో దివ్యాంగుల బాగోగులను విస్మరించడం సరైందికాదన్నారు.
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా దివ్యాంగ సంఘాల నాయకులను జిల్లా అధికారులు శాలువాలతో సత్కరించటం వలన దివ్యాంగుల జీవితాలు మారవని, సమస్యల పరిష్కారం కోసం అధికారుల దగ్గరకు పొతే పట్టించుకునే నాధుడే ఉండడని ఆవేదన వ్యక్తంచేశారు. దివ్యాంగుల కుటుంబాలను బజారుపాలు చేసి వారి పిల్లల జీవితాలకు భరోసా లేకుండా పోయిందని అన్నారు.
ఈ ప్రభుత్వం నిమ్న వర్గాలకు ఇచ్చిన ప్రాముఖ్యత ను దివ్యాంగులకు ఇవ్వకపోవడం విడ్డూరమే కాక, బంగారు తెలంగాణ అని గొప్పలు చెప్పుకుంటోందని విమర్శించారు. దివ్యాంగుల కడుపు కొట్టి కార్పోరేట్ వ్యవస్థలకు ప్రభుత్వం కొమ్ముకాస్తుందని అన్నారు. దివ్యాంగుల ఆత్మ గౌరవం దెబ్బతినే విధంగా ప్రవర్తిస్తున్న అధికారులపై చర్యలు శూన్యమని, ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపి దివ్యాంగుల జీవితాల్లో పెనుమార్పులు తీసుకురావాలని ఆయన కోరారు.