గిరిజనుల జీవనోపాధి మార్గాలను పెంచడమే లక్ష్యంగా సీయం కేసీఆర్ నేతృత్వంలోని తమ ప్రభుత్వం పనిచేస్తుందని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాంనగర్ లోని గిరిజన ఆశ్రమ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు.
ఐటీడీఏ ఆధ్వర్యంలో తోటి (గిరిజన తెగ) కులస్తులకు ప్రభుత్వం మంజూరు చేసిన స్వయం ఉపాధి పథకాల ఉపకరణాలను మంత్రి అల్లోల పంపిణీ చేశారు.18 మంది లబ్ధిదారులకు రూ. 12 లక్షల నిధులతో తోపుడు బండ్లు, కుట్టు మిషన్లు, పిండి గిర్ని ఉపకరణాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… గిరిజనులలో పేదరికాన్ని రూపుమాపి ప్రతి ఒక్కరికీ ఆర్థిక బలం చేకూర్చేవిధంగా ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు విద్య, ఉద్యోగ, ఉపాధి కల్పనతో పాటు పలు పథకాలను అమలు చేస్తున్నారన్నారు.
ఆదివాసుల్లో అత్యంత వెనుకబడిన పీటీజీ కులాల అభ్యున్నతి కోసం ఐటీడీఏ ఆద్వర్యంలో సీసీడీపీ నిధులను ఖర్చు చేస్తున్నామన్నారు. ఇందులోభాగంగా నిరుద్యోగులకు స్వయం ఉపాధి పథకాల ఉపకరణాల పంపిణీని చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని మంత్రి కోరారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కె. విజయలక్ష్మి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, కలెక్టర్ ముషారఫ్ ఫారూఖీ అలీ, ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి భవేష్ మిశ్రా, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి నర్మదా, డీటీడబ్ల్యూవో శ్రీనివాస్ రెడ్డి, పీహెచ్ వో రమణ, ఐటీడీఏ జేడీయం. నాగభూషణం, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి అల్లోల
నిర్మల్ రూరల్ మండలం కౌట్ల (కె) గ్రామంలో రూ. 30 లక్షల నిధులతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ భవనాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రారంభించారు.
అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆవరణలో మంత్రి అల్లోల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మీ, టీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ కొంగరి నర్మదా, మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి టీఆర్ఎస్ నాయకులు మల్లికార్జున రెడ్డి, గ్రామ సర్పంచ్ లక్ష్మీ, ఎంపీటీసీ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.