మద్యం ధరలు భారీగా పెంచి, సామాన్యుడిని అన్ని విధాలా దోచుకోవడానికి, ఆరోగ్యాన్ని హరించడానికి సిద్ధమైన రాష్ట్ర ప్రభుత్వం, రైతుల పట్ల శ్రద్ధ ఎందుకు చూపటం లేదో చెప్పాలని గుంటూరు జిల్లా గురజాల నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు డిమాండ్ చేశారు.
ప్రభుత్వంలో ఉన్న పెద్దలకి సొంత ఆదాయ వనరులు సమకూర్చుకోవడం లో ఉన్న శ్రద్ధ, సామాన్యులపై, రైతులు, రైతు కూలీల పై ఏమాత్రం లేదని ఆయన అన్నారు. తెలంగాణలో 30 వేల కోట్ల రూపాయల నిధిని ఏర్పాటు చేసి గ్రామాలకు వెళ్లి పండించిన పంటను, రైతుల దగ్గరకు వెళ్లి ప్రభుత్వం కొంటున్నదని, అయితే ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ప్రభుత్వం ఆ పని చేయడం లేదని ఆయన అన్నారు.
గిట్టుబాటు ధరలేక అల్లాడుతున్న రైతాంగం
పండించిన పంటను అమ్ముకునే పరిస్థితి రైతాంగానికి లేదని, మిర్చి, ప్రత్తి, ధాన్యం, మిగతా అన్ని పంటలను కొనే నాధుడు లేక, గిట్టుబాటు ధర లేక, మిర్చిని కోల్డ్ స్టోరేజ్ లోనూ, ధాన్యాన్ని గోదాముల లోనూ, ప్రత్తిని ఇంట్లో పెట్టుకుని, రైతులు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆయన అన్నారు.
ప్రభుత్వానికి ఎన్నిసార్లు విజ్ఞప్తి చేసినా ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదని యరపతినేని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి, ప్రత్తిని క్వింటాల్ రూ. 8,000/- లకు, మిర్చిని రూ. 10,000/-కు, ధాన్యాన్ని రూ. 2,000/-కు వెంటనే కొనుగోలు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఖరీఫ్ వస్తున్నా ఎరువులూ విత్తనాలు ఇవ్వరా?
వచ్చే ఖరీఫ్ కి పంటలు వేసుకోవడానికి కావలసిన విత్తనాలు, ఎరువులను ఇంతవరకూ ప్రభుత్వం సమకూర్చలేదని, రైతులు వెళ్లి అడుగుతూ ఉంటే, అధికారులు ఇంతవరకు సమాధానం చెప్పడంలేదని ఆయన అన్నారు.
రైతులకు కావలసిన విత్తనాలను ప్రభుత్వమే ఉచితంగా సరఫరా చేయాలని, రైతుల ఇబ్బందులను గమనించిన ప్రభుత్వం వెంటనే స్పందించవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు.