కరోనా నేపథ్యంలో ఆరునెలల పాటు ప్రతి పేద కుటుంబానికి నెలకు రూ,7500/-లు ప్రభుత్వం ఇచ్చి ఆదుకోవాలని కె.వి.పి.యస్. జిల్లా ఉపాధ్యక్షులు జిట్ట నగేష్, సి.ఐ.టి.యు.జిల్లా ఉపాధ్యక్షులు నారబోయ్న శ్రీనివాసులు డిమాండ్ చేశారు.
శుక్రవారం నాడు నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజక వర్గం చిట్యాల మున్సిపాలిటీ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా వైరస్ నివారణ కోసం అందరికీ ఉచితంగా కరోనా టెస్ట్ లు చేసి ప్రజల ఆరోగ్యాలు కాపాడాలని కోరారు.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి డబుల్ బెడ్ రూం ఇళ్ల మంజూరు చేయాలని, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు మంజూరు చేస్తామన్న కే సీ ఆర్ హామీని నిలబెట్టుకోవాలని కోరారు. పట్టణ ప్రాంత పేదలకు ఉపాది హామీ పథకం పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన కరోనా ప్రత్యేక ప్యాకేజీని అన్ని వర్గాల ప్రజలకు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం మున్సిపాలిటీ చైర్మన్ కోమటిరెడ్డి చిన్న వెంకట్ రెడ్డి కి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సీ.ఐ.టి.యు నాయకులు పబ్బు స్వామి, ఏళ్ళ మారయ్య, మున్సిపాలిటీ యూనియన్ ఏనుగు వెంకట్ రెడ్డి, జడల నర్సింహ, నోముల మరియమ్మ, నాగయ్య, ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు.