ప్రభుత్వ ఆర్ధిక వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంటే ఇంకోపక్క పెట్రోల్,డీజిల్ ధరలు పెంచుతూ ఉండటం దారుణమని జిల్లా సి ఐ టి యు ఉపాధ్యక్షుడు శీతల రోషపతి విమర్శించారు. కరోనా సమయంలో లాక్ డౌన్ తో గత సంవత్సర కాలంగా సంక్షోభంలో కూరుకు పోయి పనులు దొరక్క అనేక మంది కార్మికులు పస్తులతో ఉండగా మరోపక్క కరోనాతో మరణాలు జరుగుతుంటే ప్రభుత్వం ఇలా చేయడం సమంజసం కాదని ఆయన అన్నారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని ఆల్ ఇండియా CITU ఇచ్చిన పిలుపులో భాగంగా మున్సిపల్ కార్యాలయం,సి ఐ టి యు కార్యాలయం నందు గేట్ మీటింగ్ పరిసర ప్రాంతంలో కార్మికులు సంఘాలు నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా రోషపతి మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా కరోనాతో నిరుపేదలు,కార్మికులు రోడ్డున పడ్డారని, తక్షణమే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతి తెల్ల రేషన్ కార్డ్ ఉన్న కుటుంబానికి నెలకి 7,500 రూపాయలు చొప్పున 10 నెలలు ఆర్థిక సహాయం ఇవ్వాలని కోరారు.
నెలకి 30 రోజులు ఉంటే పెట్రోల్, డీజిల్ ధరలను 23 సార్లు పెంచుతూ తద్వారా నిత్యవసర వస్తువులపై భారం పడుతుంటే ప్రభుత్వం పట్టనట్టుగా ఉండటం దుర్మార్గమైన చర్య అని అన్నారు.తక్షణమే పెట్రోల్ ఉత్పత్తులపై తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా అంబానీ,ఆధానీల పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో సి ఐ టి యు జిల్లా కార్యవర్గ సభ్యుడు యలక సోమయ్య గౌడ్, వివిధ సంఘాల అధ్యక్ష్య, కార్యదర్శులు కస్తాల ముత్తమ్మ, దుర్గారావు,పర్వతాలు,కోటమ్మ, కస్తాల సైదులు,గోపి,గోవిందు,,ముస్తఫా,పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు.