మూడు నెలల లాక్ డౌన్ కాలం చేనేత రంగాన్ని సంక్షోభంలోకి నెట్టిందని మాజీ రాజ్యసభ సభ్యులు రాపోలు ఆనంద భాస్కర్ అన్నారు. కరోనా విపత్తు వల్ల చేనేత కార్మిక కుటుంబాలు పూర్తి స్థాయిలో నష్టపోయాయని తెలుసుకొని స్వయంగా గద్వాల పట్టణంలోని వీవర్స్ కాలనీ రాఘవేంద్ర కాలనీని ఆయన నేడు సందర్శించారు.
స్వయంగా కార్మికులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన చేనేత కార్మికులకు మార్చి నెల నుంచి నెలవారీగా కనీస మొత్తంలోనైనా భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అమ్మకం కాకుండా నిలిచిపోయిన ఉత్పత్తులను వీవర్ సర్వీసింగ్ సెంటర్ ద్వారా కొనుగోలు చేయాలని కోరారు.
చేనేత రంగం దుస్థితిని అర్థం చేసుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నలను ఆదుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల కోసం త్రీఫైఫ్ట్ నిధి పథకాన్ని ఏర్పాటు చేసింది. కాలపరిమితి మూడు సంవత్సరాలుగా పెట్టింది. త్రీఫైఫ్టు నిధి ఉద్దేశం చేనేత కార్మికుడు వాటా ధనం కడితే దానికి రెండింతలు రాష్ట్ర ప్రభుత్వం జమ చేస్తుంది.
కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లో కార్మికుల పరిస్థితిని గమనించి రాష్ట్ర ప్రభుత్వం కాలపరిమితికి మూడు నెలల ముందే నిధులు విడుదల చేసింది. కొంత మంది చేనేత కార్మికులకు వారికొందరు వారి జీవన పరిస్థితులు సక్రమంగా లేక వారు కట్టవలసిన వాటా ప్రతి నెలా చెల్లించ లేకపోయారు.
అలాంటి వారిని ప్రభుత్వం స్కీం నుంచి తీసేసింది. అయితే అలాంటి వారిని కూడా పథకం కిందికి తిరిగి తీసుకురావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షులు పులిపాటి వెంకటేష్, గద్వాల పట్టణ పద్మశాలి సేవా సంఘం అధ్యక్షులు తిరుమల తాయన్న, ప్రధాన కార్యదర్శి కాడికి రాములు, పద్మశాలి కుల బాంధవులు యువజన సంఘాలు చేనేత కార్మికులు తదితరులు పాల్గొన్నారు.