అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని వైస్సార్సీపీ నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతుల మహా పాదయాత్రలో పాల్గొన్న భాజపా నేతలపై కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులు ఇవ్వటం దారుణమన్నారు. పాదయాత్రకు వచ్చే వారిపై పోలీసులు అక్రమ కేసులు పెడుతున్నారని రఘురామ మండిపడ్డారు.
మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణ, శాసనమండలి రద్దు తీర్మానాన్ని వెనక్కి తీసుకునే విషయంలో ప్రభుత్వ తీరు సరిగా లేదని నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు అన్నారు. మండలి రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించకుంటున్నట్లు శాసనసభలో మంత్రి బుగ్గన చేసిన ప్రసంగం చూస్తే.. అబద్దం చెబుతున్నట్లుగా ఉందన్నారు. రైతు చట్టాలను రద్దు చేసిన సందర్భంలో ప్రధాని మోదీ రైతులకు క్షమాపణ చెప్పారని.. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం ఆమోదయోగ్యంగా లేదన్నారు.
అమరావతి రైతులు చేస్తున్న పాదయాత్రలో పాల్గొన్న భాజపా నేతలపై కొవిడ్ నిబంధనలను ఉల్లంఘించారని నోటీసులు ఇవ్వటం దారుణమన్నారు. పాదయాత్రకు వచ్చే వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజల మద్దతుతో గెలిచిన మనకు అహంకారం మంచిది కాదని హితవు పలికారు. అమరావతి రైతులకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలన్న రఘురామ.. సోమవారం నుంచి హైకోర్టులో 100 శాతం వాదనలు కొనసాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. వైకాపా ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా.. మద్యపాన నిషేధాన్నే నిషేధించేసిందని రఘురామ ఎద్దేవా చేశారు. వైస్సార్ ఆసరా.. పేరును ‘సారాతో ఆసరా’ అని, జగనన్న అమ్మఒడి పథకం పేరును ‘మీ బుడ్డితో అమ్మఒడి’ అని మార్చితే ఇంకా బావుండేదని దుయ్యబట్టారు. తాగుబోతులకు ఇంత గౌరవం పెంచిన తమ పార్టీ చిరస్థాయిలో నిలిచిపోతుందన్నారు.