బత్తాయి, మామిడి రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. బత్తాయి, మామిడిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆయన తన లేఖలో డిమాండ్ చేశారు.
కష్టంలో ఉన్న రైతులకు ప్రభుత్వం భరోసా ఇవ్వాలని, రైతులకు అండగా ప్రభుత్వం ఉందనే భరోసా ను కల్పించాలని ఆయన కోరారు. ప్రస్తుతం బత్తాయి, మామిడి రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని, ఆపద సమయంలో రైతులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని ఆయన అన్నారు.
పౌల్ట్రీ బిజినెస్ చేసే వాళ్లకు ప్రభుత్వం అండగా నిలబడిందని కానీ బత్తాయి, మామిడి రైతులకు ప్రభుత్వం ధైర్యం కల్పించలేకపోతుందని ఆయన అన్నారు. పాల్ట్రీ పరిశ్రమకు దన్నుగానిలిచిన ప్రభుత్వం బత్తాయి,మామిడి రైతులకు ఎందుకు అండగా ఉండడం లేదని ఆయన ప్రశ్నించారు.
బత్తాయి టన్నుకు గతంలో 40 వేల రూపాయలు ఉండేదని, ఇప్పుడు కూడా ప్రభుత్వం టన్నుకు 40 వేల ధరకు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని ఎంపి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. కొనుగోలు చేసిన బత్తాయిలను పేద ప్రజలకు ప్రభుత్వం పంచాలని, ప్రజల ఆరోగ్యాలను ప్రభుత్వం కాపాడాలని ఆయన అన్నారు.
బత్తాయి లో సి విటమిన్ ఉంటుందని, బత్తాయిలు తింటే ఆరోగ్యానికి మంచిదని బత్తాయి తినడం రోగనిరోధక శక్తి పెంచుతుందని చెప్పారు.