70 సంవత్సరాలుగా బీసీ,ఎస్సీ,ఎస్టీ జాబితాలో లేని కులాలను గుర్తించి బీసీ లలో చేర్చాలని బీసీ కమిషన్ సిఫార్సు చేసినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవడం లేదని జాతీయ సంచార జాతుల సంఘం ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుండ్లపల్లి అన్నారు.
బైలు కమ్మర (గిసాడి), బాగోతుల/భగవతుల, అద్దపువారు, బొప్పల/తోలు బొమ్మలవారు, గంజికూటి, గౌడజెట్టి, కాకిపడగల, ఓడ్/ఒడ్డు, పటం/మాసయ్యలు, రామజ్యోగి/ రామజోగుల/ శ్రీక్షత్రియ రామజోగి, సన్నాయిల, తెరచీరల, గైలి, సారోళ్లు, అహీర్ యాదవ్, అరవ కోమటి, కుల్లకడిగి, ఏనోటి కులాలను బీసీ ఏ గ్రూపులో చేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.
బీసీ కమిషన్ సిఫార్సు చేసినా కూడా జాబితాలో చేర్చేదుకు ప్రభుత్వ ఎందుకు జాప్యం చేస్తున్నదని ఆయన ప్రశ్నించారు. ఈ 18 కులాల వారు ప్రభుత్వం గుర్తింపు లేకుండా వారి పిల్లలకు విద్యాపరమైన రిజర్వేషన్ లేక సంవత్సరాల తరబడి నిరీక్షణలో ఉన్నాయని ఆయన అన్నారు.
బీసి కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసి తర్వాత పూర్తి ఆధారాలు సమర్పించాలని దరఖాస్తు చేసుకున్న కుల ప్రతినిధులను కోరారని ఆయన తెలిపారు. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి, పరిశీలించిన బీసీ కమిషన్ ఈ 18 కులాలు బీసీ జాబితాకు అర్హులుగా భావించిందని సత్యనారాయణ తెలిపారు.
అందులో 16 సంచార జాతుల కులాలు ఉన్నాయని, వెంటనే జాబితా లో చేర్చాలని బీసీ కమిషన్ అక్టోబర్ 2019 లో ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిందని ఆయన తెలిపారు. కానీ ఇప్పటి వరకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని దీనివల్ల ఆయా కులాల విద్యార్ధులు నష్టపోతున్నారని ఆయన అన్నారు.