అర్హులకు ఓటు హక్కు రాకుండా కుట్రపూరితంగా ప్రవర్తించారన్న కారణంతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ ఇద్దరు ఐఏఎస్ అధికారులపై ఇచ్చిన అభిశంసన ఉత్తర్వులను జగన్ సర్కార్ తిప్పికొట్టింది. ఇలా సీనియర్ ఐఏఎస్ అధికారులను సెన్ష్యూర్ చేసే అధికారి ఎస్ఈసీకి లేదని ప్రభుత్వం వాదిస్తున్నది.
అధికారుల వివరణ లేకుండా ప్రొసీడింగ్స్ను జారీ చేయలేరన్న ప్రభుత్వం ఐఏఎస్ అధికారుల సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా చర్యలు తీసుకునే అధికారం లేదని తెలిపింది. అసలు అధికారుల వివరణ కూడా లేకుండా పెనాల్టీ ఎలా సిఫార్సు చేస్తారని ప్రశ్నించింది.
ఇద్దరు సీనియర్ అధికారులపై చర్యలు తీసుకోవడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. ఎన్నికల ప్రక్రియకు ఉద్దేశ్యపూర్వకంగా విఘాతం కలిగించారని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ గిరిజా శంకర్లను ఎన్నికల కమిషనర్ అభిశంసించిన విషయం తెలిసిందే.
గ్రామ పంచాయతీల వారీగా ఓటర్ల జాబితా తయారీలో వారు నిర్లక్ష్యంగా వ్యవహరించారని, విధి నిర్వహణలో వారు విఫలమైనట్లుగా వారి సర్వీసు రికార్డులో నమోదు చేయాలన్నారు. సెన్సూర్ కింద క్రమశిక్షణ చర్యలంటే ఒక ఏడాదిపాటు పదోన్నతులకు అవకాశం ఉండదు.
ఎన్నికల కమిషనర్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఒక్క సారిగా ఆంధ్రప్రదేశ్ అధికారులు తాము చేస్తున్న తప్పు ఏమిటో తెలుసుకున్నారు. నిబంధనల ప్రకారం నడచుకోవాలి తప్ప ఎవరో చెప్పిరని చేయకూడదని భావించారు. అయితే తప్పు చేసిన అధికారులను రాష్ట్ర ప్రభుత్వం వెనకేసుకువచ్చింది.
రాబోయే రోజుల్లో ఇది పెను వివాదానికి దారి తీసే అవకాశం ఉంది. ఎన్నికల కమిషనర్ ఇప్పటికే సంబంధిత ఉన్నతాధికారులకు తన సిఫార్సులను పంపించినందున రాష్ట్ర ప్రభుత్వం తిప్పి పంపినా ఉససంహరించుకున్నా కుదిరేపని కాదని న్యాయ నిపుణులు అంటున్నారు.