ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం కోసం వివిధ ఆలయాలకు ఆర్ధిక సహాయం అందించేందుకు గాను ప్రభుత్వం 15 కోట్ల రూపాయలను విడుదల చేసిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు.
సోమవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సికింద్రాబాద్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయానికి బోనాల ఉత్సవాల నిర్వహణ కోసం ప్రభుత్వం మంజూరు చేసిన 15 లక్షల రూపాయల చెక్కును ఆలయ EO మనోహర్ రెడ్డి, ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 25 వ తేదీన సికింద్రాబాద్ బోనాల ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. సికింద్రాబాద్ లోని మిగిలిన ఆలయాలకు ఈ నెల 20 వ తేదీ మంగళవారం ఉదయం 9.30 గంటలకు శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో అందజేయడం జరుగుతుందని మంత్రి వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ కృష్ణ, మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.