సమగ్ర శిక్షా ప్రాజెక్టు అన్ని కేటగిరీలకు జీతాలు పెంచి వారికి సామాజిక న్యాయం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమగ్ర శిక్ష ఒప్పంద పొరుగు సేవల ప్రభుత్వ పాఠశాలల సంఘ అధ్యక్షుడు గణపతి జగదీశ్వర రావు కోరారు. ఈ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్నసి.ఆర్పి .లకు, ఐ. ఈ. ఆర్. టీ, ఉపాధ్యాయుల రెండు కేటగిరీల ఉద్యోగస్తులకు మాత్రమే జీతాలు పెంచారని, కొన్ని సంవత్సరాలు గా మిగతా క్యాటగిరి లో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగస్తులకు ఒక రూపాయి కూడా వేతనం పెంచలేదని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
శ్రీకాకుళం రూరల్ మండలం నైరా గ్రామం లో ఆయన నేడు మీడియాతో తమ బాధలు పంచుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి, విద్యా శాఖా మంత్రి ఆదిమూలపు సురేష్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బి.రాజశేఖర్, స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.చిన వీరభద్రుడు తమ సమస్యలపై దృష్టి సారించాలని ఆయన కోరారు.
సమగ్ర శిక్షా ప్రాజెక్టు ఎం. ఐ .ఎస్ .కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, అకౌంటెంట్లు, మెసెంజర్ కెజిబివిలలో వివిధ కేటగిరీలలో పనిచేస్తున్న సి ఆర్ టీ ఉపాధ్యాయులు, కేజీబీవీ లో పనిచేస్తున్న ప్రత్యేక అధికారులు, ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ అధ్యాపకులు, ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న ఆర్ట్ ,క్రాఫ్ట్, వ్యాయామ ఉపాధ్యాయులు , విజయ ప్రాజెక్టులో పనిచేస్తున్న సైట్ ఇంజనీర్లను, నైట్ వాచ్ మెన్, టెండర్లను దిగువ స్థాయి సిబ్బంది కి, కేజీబీవీ పాఠశాలలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగస్తులకు కూడా వేతనాలు పెంచాలని ఆయన కోరారు.
ఆంధ్ర ప్రదేశ్ సమగ్ర శిక్ష వేతన సంఘం సూచించిన ప్రకారం పెరిగిన వేతనాలు ఏప్రిల్ 2019 నుండి అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు అన్ని కేటగిరీలకు జీతాలు పెంచి వారికి సామాజిక న్యాయం చేయాలని కోరారు.
ఇప్పటికే లో పనిచేస్తున్న ఒప్పంద పొరుగు సేవల ఉద్యోగస్తులు చాలా మంది చనిపోయారని, చాలామంది ఉద్యోగస్తులు అనారోగ్య పాలయ్యారని వీరికి ఒక్క రూపాయి కూడా ప్రాజెక్టు నుండి సహాయం అందించడం లేదని అన్నారు. అదేవిధంగా సమగ్ర శిక్ష కేజీబీవీలో ఇంటర్మీడియట్ కళాశాలలో పనిచేస్తున్న మహిళ అధ్యాపకులకు వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు లేదని అన్నారు. 2004 నుంచి నేటి వరకు పనిచేస్తున్న ఏ ఒక్క ఉద్యోగి కూడా ప్రభుత్వం పనికి తగ్గ వేతనం కూడా ఇవ్వలేదని ఈ సందర్భంగా తెలియజేశారు.