విద్యుత్ బకాయిల పేరుతో గ్రామ సర్పంచ్ లకు చెప్పకుండా, వారికి తెలియకుండా, వారి సంతకాలు కూడా తీసుకోకుండా గ్రామ పంచాయతీల అకౌంట్ల నుంచి రూ.344 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం దొంగిలించిందని ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ ఛాంబర్ అధ్యక్షులు Y.V.B. రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
మరో రూ. 4187 కోట్లు తీసేసుకోవడానికి ఇంధన కార్యదర్శి శ్రీకాంత్ జీవో నెం.90, చీఫ్ సెక్రటరీ ఆదిత్య నాద్ దాస్ జీవో నెం. 569 లను జారీ చేశారని ఆయన తెలిపారు. ఈ జీవోల వెనుక పెద్ద కుట్ర దాగివుందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. ఈ జీవోలే కనుక అమలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సుమారు 13 వేల గ్రామ పంచాయతీలలోను ఒక్క రూపాయి కూడా మిగలవని ఆయన అన్నారు.
పంచాయతీలకు వివిధ పన్నుల ద్వారా, పథకాల ద్వారా వచ్చిన డబ్బులన్నీ విద్యుత్ బిల్లులకే జమ అయిపోతాయని ఆయన తెలిపారు. దానితో గ్రామాల అభివృద్ధి ఆగిపోతుదని, గ్రామ పంచాయతీలు నిర్వీర్యం అయిపోయి, సర్పంచ్ లు ఉత్సవ విగ్రహాల్లాగా మిగిలి పోతారని రాజేంద్ర ప్రసాద్ తెలిపారు.
14 వ, 15 వ ఆర్థిక సంఘాల నిధుల క్రింద గ్రామాల అభివృద్ధి కోసం సుమారు 4 వేల కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలకు ఇటీవలే పంపించిందని ఆయన తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో ఈ విధంగా దొడ్డి దారిన గ్రామపంచాయతీల నిధులను దారి మళ్లించి తన స్వంత అవసరాలకు, పథకాలకు, నవరత్నాలకు అక్రమంగా వాడుకుంటోందని రాజేంద్ర ప్రసాద్ ఆరోపించారు.
దీని వలన రాష్ట్రంలోని సుమారు 13 వేల గ్రామపంచాయతీల్లో ఇప్పటికే కొన్ని పంచాయతీల cfms ఖాతాల్లో జీరో బ్యాలన్స్ చూపిస్తున్నాయని ఆయన తెలిపారు. ఇది 14,15 వ ఆర్థిక సంఘాల గైడ్ లైన్స్ కు, కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు వ్యతిరేకమని ఆయన తెలిపారు. 1983 సంవత్సరం నుంచి అప్పటి ముఖ్యమంత్రి ఎన్. టి. రామారావు రైతులతో పాటుగా గ్రామపంచాయతీలకు కూడా ఉచిత విద్యుత్ పథకాన్ని ప్రకటించారు.
దానిని చంద్రబాబు నాయుడు, Y. S. రాజశేఖర్ రెడ్డి, తదుపరి ముఖ్యమంత్రులు కూడా కొనసాగించారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పంచాయతీల విద్యుత్ బిల్లులను గత సంవత్సరాలవి కూడా వసూళ్లు చెయ్యాలని ఆదేశాలు జారీ చెయ్యడం దారుణమని రాజేంద్ర ప్రసాద్ అన్నారు. దీనిని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ ఛాంబర్ తీవ్రంగా ఖండిస్తోందని రాజేంద్ర ప్రసాద్ అన్నారు.