నిర్మల్ జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు.
మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరోనా వైరస్ నియంత్రణ పై ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ముషర్రఫ్ ఫారూఖీతో కలిసి మంత్రి పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రజలెవరూ ఆందోళన చెందకుండా ప్రతి ఒక్కరూ మాస్కులు ధరించి సామజిక దూరం పాటించాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 2757 మందికి సాంపుల్ సేకరించామని, 469 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయని తెలిపారు.
314 యాక్టివ్ కేసులు ఉన్నాయన్నారు. 149 మందిని డిశ్చార్జి చేశామని చెప్పారు. హోం ఐసోలేషన్ లో 271మంది ఉన్నారన్నారు. జిల్లాలో కరోనా వల్ల ఆరుగురు మరణించారన్నారు. పాజిటివ్ వచ్చిన వారికీ మెడికల్ కిట్లను అందజేస్తున్నామని, అధికారులు, వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ సేవలందిస్తున్నారని అన్నారు.
నిర్మల్ లో వ్యాపారస్తులు నేటి నుండి వారం రోజులు స్వచ్చందంగా లాక్ డౌన్ పాటించడం అభినందనీయమన్నారు. అలాగే 15ఆగస్టు, వినాయక చవితి పండగ ఉత్సవాలను ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ జరుపుకోవాలని సూచించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు అప్రమత్తంగా ఉంటూ నిబంధనలు పాటించాలన్నారు.
జిల్లాలోని ప్రాంతీయ ఆసుపత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కరోనా పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రజలు ఆందోళన చెడకుండా జ్వరం, దగ్గు, జలుబు ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. ప్రయివేట్ ఆసుపత్రులకు వెళ్లవద్దన్నారు. పాజిటివ్ వచ్చిన వారికోసం నిర్మల్ 70పడకలు, బైంసా లో 30పడకల ఐసోలేషన్ వార్డులను ఏర్పాటు చేశామన్నారు.
ఈ సమావేశంలో ఎఎస్పీ రాంరెడ్డి, డిఎస్పీ ఉపేంద్ర రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. వసంత్ రావు, జిల్లా కరోనా నియంత్రణ ప్రత్యేక అధికారి డా. కార్తీక్, ప్రాంతీయ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. దేవేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఎన్. బాలకృష్ణ అధికారులు తదితరులు పాల్గొన్నారు.