వైసీపీ ప్రభుత్వం ప్రతిపక్షనాయకులపై కక్ష సాధింపులు, వేధింపులకు పాల్పడుతూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిమిడి కళా వెంకట్రావు విమర్శించారు. టీడీపీ నాయకులపై అక్రమ కేసులు పెట్టి, అనారోగ్యం పాలు చేసి శారీరకరంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన అన్నారు.
అరెస్ట్ అయి జైల్ లో ఉన్న జేసీ ప్రభాకర్ రెడ్డికి కరోనా రావడానికి ప్రభుత్వ నిర్లక్ష్యం, కక్ష పూరిత వైఖరే కారణమని ఆయన అన్నారు. జైలు నుంచి విడుదలైన 24 గంటల్లోనే జేసీ ప్రభాకర్ రెడ్డిని చేయని తప్పుకు తప్పుడు కేసు పెట్టి మళ్లీ జైలుకు పంపారని, రెండవసారి అరెస్ట్ చేయటం వల్లే ప్రభాకర్ రెడ్డి కి కరోనా పాజిటివ్ వచ్చిందని ఆయన అన్నారు.
వైసీపీ ప్రభుత్వం కరోనాని కూడా కక్ష సాధింపు చర్యలకు ఆయుధంగా వాడుకుంటోందని కళా వెంకటరావు అన్నారు. ఆపరేషన్ చేయించుకున్న అచ్చెన్నాయుడు అక్రమ కేసులతో జైలుకు పంపిన ప్రభుత్వం ఆయనకు కరోనా రావడానికి కారణం అయిందని, అత్యంత భద్రత మద్య ఉన్న ప్రభాకర్ రెడ్డికి, అచ్చెన్నాయుడికి కరోనా ఎలా వచ్చింది? అచ్చెన్నాయుడు, ప్రభాకరరెడ్డికి ఏమైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.